హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): వావివరుసల్లేని సోషల్ మీడియాలో అసత్యాలను గుప్పిస్తూ.. ఆ వాపును చూసి బలుపనుకుంటున్న బీజేపీకి.. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి ఏంటో పురపోరు కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాల్టీల్లో 248 డివిజన్లు/వార్డులకు ఎన్నికలు జరిగితే.. అందులో బీజేపీ సాధించింది 16 సీట్లు! అంటే.. 6.45 శాతమే. నిజానికి రాష్ట్రంలో బీజేపీ దీనస్థితి ఏమిటో మొన్నటి పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు, నిన్న నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఫలితాలు తేటతెల్లం చేయగా, తాజాగా.. పురపోరు బీజేపీ వీపుచరిచి.. మూలన కూర్చొనబెట్టింది. సోషల్ మీడియాలో అంతెత్తున ఎగిరిపడి చేసిన బీజేపీ షో.. అట్టర్ఫ్లాప్ అయింది. సీఎం కేసీఆర్పైన, ప్రభుత్వం పైన, టీఆర్ఎస్పైన దుమ్మెత్తిపోయటమే ఎజెండాగా పెట్టుకున్న బీజేపీని ప్రజలు అసహ్యించుకున్నారు.
బట్ట కాల్చి మీదేసే బీజేపీ వైఖరి సహించని జనం.. కర్రుగాల్చి వాతపెట్టారు. బీజేపీకి తెలంగాణలో స్థానం లేదని విస్పష్టంగా చాటిచెప్పారు. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు మున్సిపాల్టీల ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి చుక్కలు చూపించారు. ఈ ఏడు స్థానిక సంస్థల్లో మొత్తంగా 248 డివిజన్లు/ వార్డులకు ఎన్నికలు జరిగితే.. బీజేపీ 16 చోట్ల.. అదీ బహుముఖ పోటీ పుణ్యమాని చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా గెలిచింది. అంటే.. ఆ పార్టీ కనాకష్టంగా గెలిచింది 6.45% సీట్లు మాత్రమే. ఇదీ రాష్ట్రంలో బీజేపీ బతుకు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ కార్పొరేటర్గా గెలిచిన బీజేపీ అభ్యర్థి మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిని పోటీకి నిలుపవద్దని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను వేడుకోవడంతో.. మానవతా దృక్ఫథంతో అక్కడ టీఆర్ఎస్ పోటీచేయలేదు. చివరికి టీఆర్ఎస్ బరిలో లేకున్నా ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడం కూడా బీజేపీకి చేతకాలేదు.
మొన్న రెండు ఎమ్మెల్సీ నిన్న సాగర్
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నామని పురపోరు సందర్భంగా తెలంగాణ సమాజం మరోమారు చాటింది. బీజేపీ నేతల చిల్లర విమర్శలు.. చౌకబారు మాటలు, ఆఖరుకు ముఖ్యమంత్రిని సైతం ఏకవచనంతో సంబోధిస్తూ తిట్లవర్షం కురిపించడం.. సోషల్ మీడియాలో అబద్ధాలను ప్రచారం చేయడం ప్రజల్లో ఆ పార్టీని చులకన చేసింది. దుబ్బాకలో బొటాబొటి ఓట్లతో బయటపడిన బీజేపీ.. వాపును చూసి బలుపన్న భావనలో పడిపోయింది. వాస్తవానికి అక్కడ బీజేపీ సోషల్మీడియాలో చేసిన తప్పుడు ప్రచారాలే టీఆర్ఎస్ విజయావకాశాలను దెబ్బతీశాయి. ఆ తర్వాత జీహెచ్ఎంసీలో నాలుగుసీట్లు రాగానే చెప్పుమీద కుచ్చులేసినట్టు బీజేపీ నాయకులు ఎగిరెగిరిపడుతున్నారు.
బీజేపీ బుడగలు బద్దలుకొడుతున్న రాష్ర్టాలు
కులం, మతం, ప్రాంతం పేరుతో ఓట్లు రాల్చుకోవాలనే బీజేపీ నేతల ఎత్తులు, కుట్రలను తెలంగాణ సమాజమే కాదు యావత్దేశం గ్రహించింది. దేశవ్యాప్తంగా బీజేపీపై తిరుగుబాటు మొదలైంది. దేశంలో గుప్పెడుమంది బడా సంపన్నుల సంపదను పెంచేందుకు 130 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను బీజేపీ తుంగలో తొక్కుతున్నదని గ్రహించిన ప్రజలు ఆ పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. తాజాగా పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ర్టాల్లో బీజేపీకి తగిలిన చావుదెబ్బలే ఇందుకు నిదర్శనం. ఆఖరుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా బెంగాల్లో మకాంవేసి ప్రచారం చేసినా.. జనం పట్టించుకోలేదు. అంతకుముందే ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్లో జరిగిన ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం ప్రజలు బీజేపీని ఓడించారు.
విద్యావంతులూ చెంప ఛెళ్లుమనిపించారు
బీజేపీ మాయమాటలను రాష్ట్రంలో ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదని ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగానే తేటతెల్లమైంది. వాస్తవానికి పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగింది హైదరాబాద్ -రంగారెడ్డి- మహబూబ్నగర్, నల్లగొండ- వరంగల్ -ఖమ్మం.. రెండు నియోజకవర్గాలకే అయినా.. వీటి పరిధిలో ఆరు ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. రాష్ట్రంలోని మూడొంతుల ప్రాంతానికి చెందిన విద్యావంతులు ఈ రెండు స్థానాల ఎన్నికల్లో పాల్గొని, బీజేపీని తిరస్కరించారు. మరో విచిత్రం ఏమిటంటే.. ఇందులో ‘హైదరాబాద్’ నియోజకవర్గం బీజేపీ సిటింగ్ స్థానం. ఇక్కడ కూడా ఆ పార్టీ గెలువలేకపోయింది. నిన్నటికి నిన్న గ్రామీణ ఓటర్లు ఉన్న సాగర్ ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్ కూడా మిగల్లేదు. ఈ రోజు పట్టణ ఓటర్లు పాల్గొన్న పురపోరులోనూ పజీత దక్కలేదు. తొడలు కొట్టినవాళ్ల తొడలు వాచిపోయాయి.మొత్తంగా బీజేపీని ప్రజలు నిర్దంద్వంగా తిరస్కరిస్తున్నారనేందుకు కొద్దిరోజుల వ్యవధిలో జరిగిన ఈ ఎన్నికలే ప్రబల నిదర్శనంగా నిలుస్తున్నాయి.