తొలి రెండు రోజులు కనీసం పోటీలో కూడా లేని ఇంగ్లండ్.. అద్వితీయ పోరాటంతో అద్భుత విజయం సాధిస్తే.. ఆరంభంలో పూర్తి ఆధిపత్యం కనబర్చిన టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్లో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్లో ప్రభావం చూపలేకపోయింది.
ఉత్కంఠ భరితంగా సాగిన ఉప్పల్ టెస్టులో బ్యాట్తో ఓలీ పోప్ గుర్తుంచుకోదగ్గ ఇన్నింగ్స్తో చెలరేగితే.. బంతితో హార్ట్లీ బెంబేలెత్తించాడు. స్పిన్ బాగా ఆడుతారనే పేరున్న భారత ఆటగాళ్లు.. ఓ అరంగేట్ర స్పిన్నర్కు ఏడు వికెట్లు సమర్పించుకోవడం గమనార్హం!
వెస్టిండీస్తో రెండో టెస్టులో 216 పరుగుల లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా 8 పరుగుల దూరంలో నిలిచిపోతే.. ఇంగ్లండ్ నిర్దేశించిన 231 పరుగుల చేజింగ్లో టీమ్ఇండియా 28 పరుగులతో మ్యాచ్ను చేజార్చుకుంది. ఈ రెండు మ్యాచ్ల్లోనూ ఆరంభంలో ఆతిథ్య జట్లే రాణించినా.. టాపార్డర్ వైఫల్యాలతో పరాజయం పాలవడం కొసమెరుపు!!
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఇంగ్లండ్ అద్భుతం చేసింది. ఆశలే లేని స్థితి నుంచి గొప్పగా పోరాడిన ఇంగ్లిష్ జట్టు.. ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0తో బోణీ కొట్టింది. బ్యాటర్ల పట్టుదలకు బౌలర్ల సహాకారం తోడవడంతో ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన మొదటి టెస్టులో ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో భారత్పై ఘనవిజయం సాధించింది. ఒక దశలో ఇంగ్లండ్ ఓటమి ఖాయమనుకుంటే.. చివరి రెండు రోజులు వీరోచితంగా పోరాడిన పర్యాటక జట్టు కొండంత ఆత్మవిశ్వాసాన్ని మూటగట్టుకుంది. సొంతగడ్డపై అదరగొడతారు అనుకున్న మన స్పిన్నర్లు తేలిపోగా.. ఇంగ్లండ్ తరఫున తొలి టెస్టు ఆడిన లెఫ్టార్మ్ స్పిన్నర్ హార్ట్లీ ఏడు వికెట్లతో టీమ్ఇండియా పతనాన్ని శాసించాడు. 231 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ రెండో ఇన్నింగ్స్లో 202కే ఆలౌటైంది.
రోహిత్ (39; 7 ఫోర్లు) టాప్ స్కోరర్. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 316/6తో ఆదివారం నాలుగో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్.. చివరకు 420 పరుగులకు ఆ లౌటైంది. పోప్ (196; 21 ఫోర్లు) చివరి వికెట్గా వెనుదిరిగాడు. రేహాన్ (28), హార్ట్లీ (34) అతడికి చక్కటి సహకారం అందించారు. చివరి నాలుగు వికెట్లు తీసేందుకు భారత్ తీవ్రంగా ఇబ్బంది పడింది. శనివారం లోయర్ఆర్డర్తో కలిసి ఫోక్స్ 104 పరుగులు జోడించడంతో భారత్ ముందు 231 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మన బౌలర్లలో బుమ్రా 4, అశ్విన్ 3 వికెట్లు పడగొట్టారు.
ఒకటి నుంచి తొమ్మిదో స్థానం వరకు బ్యాటింగ్ చేయగల సమర్థులున్న భారత జట్టు ముందు 231 లక్ష్యం పెద్దది కాదనిపించింది. అందుకు తగ్గట్లే కెప్టెన్ రోహిత్ శర్మ ధాటిగా ఆడటంతో పని సువులే అనిపించింది. అయితే హార్ట్లీ రంగప్రవేశంతో పరిస్థితి మారిపోయింది. యశస్వి (15)తో ప్రారంభమైన వికెట్ల పతనం ఇక ఏ దశలోనూ ఆగలేదు. శుభ్మన్ గిల్ (0) మరోసారి నిరాశ పరుస్తూ ఎదుర్కొన్న రెండో బంతికే డకౌట్ కాగా.. కేఎల్ రాహుల్ (22), అక్షర్ పటేల్ (17), శ్రేయస్ అయ్యర్ (13), రవీంద్ర జడేజా (2) ఒకరి వెంట ఒకరు పెవిలియన్కు క్యూ కట్టారు. ఫలితంగా 119/7తో భారత్ పరాజయం ఖాయం కాగా.. చివర్లో శ్రీకర్ భరత్ (28), అశ్విన్ (28) కాస్త ఆశలు రేపినా.. ఈ ఇద్దరి వికెట్లు పడగొట్టిన హార్ట్లీ టీమ్ఇండియాను మరోసారి దెబ్బకొట్టాడు. అశ్విన్, జడేజా, అక్షర్ను ప్రత్యర్థి బ్యాటర్లు రివర్స్ స్వీప్ ఆయుధంతో దెబ్బకొడితే.. మనవాళ్లు ఛేదనలో కనీస పోరాటం కనబర్చలేకపోయారు.
1 భారత్లో అత్యధిక (15) టెస్టు విజయాలు నమోదు చేసిన జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ 14 మ్యాచ్లు నెగ్గాయి.
1 హైదరాబాద్లో (ఎల్బీ, ఉప్పల్ మైదానాల్లో కలిపి) భారత జట్టు టెస్టు మ్యాచ్ ఓడిపోవడం ఇదే తొలిసారి.
1 తొలి ఇన్నింగ్స్లో 190 పరుగుల వెనుకబడి ఉండి భారత్లో ఓ విదేశీ జట్టు టెస్టు మ్యాచ్ గెలవడం ఇదే తొలిసారి. 1964లో ఆస్ట్రేలియా
65 పరుగుల వెనుకబడి ఉండి ఆ తర్వాత మ్యాచ్ నెగ్గింది.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 246;
భారత్ తొలి ఇన్నింగ్స్: 436;
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 420 (పోప్ 196, డకెట్ 47; బుమ్రా 4/41, అశ్విన్ 3/126); భారత్ రెండో ఇన్నింగ్స్: 202 (రోహిత్ 39;
భరత్ 28; హర్ట్లీ 7/62).