సిద్దిపేట కలెక్టరేట్, మే1 : కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను తలకిందులు చేస్తున్న తరుణమిది.. ఆర్థికవ్యవస్థ కుదేలవుతున్న ఆపత్కాలంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడ్డొదని రాష్ట్ర ప్రభుత్వం పెద్దమనస్సుతో ఆలోచన చేసింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలో చివరి గింజ వరకూ కొనుగోలు చేసేందుకు ఊరురా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందడంతో యాసంగిలో బంగారు పంటపండింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి దిగుబడి ఎక్కువగా వచ్చింది. కరోనా నేపథ్యంలో ధాన్యం కొనుగోలు విషయంలో ఆందోనలో ఉన్న రైతులకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రంగంలో దిగిన జిల్లా అధికార యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా 407 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చకచకా పనులు పూర్తి చేసింది. జిల్లాలో ఈ సారి 5,46,848 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అంచనా వేసింది. ఇప్పటికే అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. పదిరోజుల నుంచే ధాన్యం సెంటర్లకు వస్తుండగా.. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సాగును లాభసాటిగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఈ సారి చెరువులు, కుంటలు, చెక్డ్యాంలు పొంగిపొర్లడంతో రైతులు ఎక్కువగా వరిసాగు చేశారు. రంగనాయకసాగర్, కొండపోచమ్మతో, మల్లన్నసాగర్, తపాస్పల్లి రిజర్వాయర్, తదితర ప్రాజెక్టుల ద్వారా పంటకు సరిపడా నీరు అంజేసింది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా పుష్కలంగా వరి పంటలు పండాయి. ఎంతో కష్టపడి సాగు చేసిన పంటలు దళారుల పాలు కాకుండా కనీస మద్దతు ధరతో కోనుగోలు చేసేలా సీఎం కేసీఆర్ అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 2లక్షల 83వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. దీంతో 5,46,848 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కొనుగోళ్ల జోరు..
జిల్లాలో 407 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అధికారులు మొదటగా 334 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అనుకున్నా, అధిక మొత్తంలో ధాన్యం వస్తుందనే అంచనాతో కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచారు. మొత్తం407 కొనుగోలు కేంద్రాల్లో 1.50 లక్షల గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు తల్తెతకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. రైతుల ఖాతాల్లో త్వరగతిన చెల్లింపులు జరిగేలా అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. క్వింటాలుకు మొదటి రకానికి రూ.1888, సాధారణ రకానికి రూ.1868 మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇప్పటికే జిల్లాలో 2,54,000 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది.
తేమశాతం 17కు మించొద్దు..
కొనుగోలు కేంద్రాల్లో ప్రధానంగా తేమశాతం 17కు మించొద్దని అధికారులు చెబుతున్నారు. మద్దతు ధర పొందాలంటే ప్రమాణాలు పాంటించడం అత్యంత ముఖ్యం. దీనీ వల్ల కొనుగోలు కేంద్రాల వద్ద సమస్య తలెత్తే అవకాశం ఉండదు. అధికారులు కూడా పదేపదే ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, మహిళలకు తాత్కాలిక టాయిలెట్స్, టార్పాలిన్ కవర్లు, ప్యాడీక్లీనర్లు, వేయింగ్ సేల్స్, మాయిశ్చరైజ్ మీటర్లు అందుబాటులో ఉంచారు.