IND vs PAK : భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రపంచంలో అతి పెద్ద సమరంగా భావించే యాషెస్ (ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య) సిరీస్ కంటే.. దాయాదుల పోరుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాళ్లు కోకొల్లలు. అందుకు తగ్గట్లే చిరకాల ప్రత్యర్థుల మధ్య సమరం అంటే ఫ్యాన్స్ రచ్చ మామూలుగా ఉండదు. అయితే.. ఆసియా కప్(Asia Cup 2023)లో మాత్రం ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్లకు పెద్దగా ప్రజాదరణ కనిపించడం లేదు. భారత్, పాక్ లీగ్ దశ మ్యాచ్ సమయంలో కొన్ని ఖాళీ స్టాండ్స్ దర్శనమిచ్చాయి. ఈరోజు సూపర్-4 పోరుకి వేదిక అయిన ప్రేమదాస స్టేడియం దాదాపు మొత్తం ఖాళీగానే కనిపించింది.
భారత్, పాక్ మ్యాచ్కు వర్ష సూచన ఉండటంతో కొలంబోలోని ప్రేమదాస మైదానం బోసిపోయింది. ఈ రెండు జట్ల మధ్య చివరిసారిగా 2012 టీ20 వరల్డ్ కప్లో ఇక్కడే తలపడ్డాయి. అప్పుడు ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా భారత ఫ్యాన్స్తో స్టేడియం కిక్కిరిసి పోయింది. అయితే.. ఈరోజు ఆదివారమైనప్పటికీ మ్యాచ్ను ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు పెద్దగా ఆసక్తి చూపంచలేదు.
దాంతో, కామెంటేటర్లతో పాట, నిర్వాహకులను సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. మరో విషయం ఏంటంటే.. సూపర్-4 మ్యాచ్ల టికెట్ రేట్లు తగ్గిస్తున్నట్లు ఇటీవల లంక బోర్డు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే.. వాతావరణ సూచన కారణంగానే ఎక్కువ మంది అభిమానులు రాలేదనుకుంటున్నామని లంక క్రికెట్ బోర్డు ప్రతినిధులు వెల్లడించారు.
ఆసియా కప్లో భారత్(India), పాకిస్థాన్(Paksitan) సూపర్ 4 మ్యాచ్ కోసం ఎదురు చూసిన అభిమానులకు వరుణుడు షాకిచ్చాడు. వాన ఎంతకూ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. అయితే.. రేపు రిజర్వ్ డే(Reserve Day) ఉండడంతో 50 ఓవర్ల ఆటకు అవకాశం ఉంది. భారత జట్టు 24.1వ ఓవర్తో యథావిధిగా ఇన్నింగ్స్ కొనసాగించనుంది.