ఆసియా కప్ నుంచి భారత జట్టు సూపర్ 4 దశలోనే నిష్క్రమించినా.. ఈ టోర్నీలో స్టార్ ఆటగాడు కోహ్లీ అద్భుతమైన ఫామ్లోకి రావడం అభిమానులకు సంతోషాన్నిచ్చింది. అంతేకాకుండా చివరి మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన కోహ్లీ.. మూడేళ్ల సెంచరీ కరువును తీరుస్తూ టీ20ల్లో తొలి శతకం నమోదు చేశాడు. దీనికితోడు అతను ఐపీఎల్లో కూడా ఓపెనర్గా అద్భుతంగా రాణించాడు.
ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకున్న పలువురు మాజీలు, అభిమానులు అందరూ కూడా.. టీ20 ప్రపంచకప్లో కోహ్లీ ఓపెనర్గా రావాలని కోరుకుంటున్నారు. అయితే ఇవన్నీ పనికిమాలిన ఆలోచనలని మాజీ లెజెండ్ గౌతమ్ గంభీర్ కొట్టిపారేశాడు. ‘ఈ నాన్సెన్స్ మొదలు పెట్టకండి. కేఎల్ రాహుల్, రోహిత్ ఉండగా కోహ్లీ ఓపెనర్గా రావడం జరగదు. అసలు దీనిపై చర్చ జరగడమే వేస్ట్.
మూడో నెంబర్పై కూడా నా వరకు నాకు వేరే ఆలోచనలు ఉన్నాయి. ఓపెనర్లు పది ఓవర్లు ఆడితే ఆ స్థానంలో సూర్యకుమార్ను దింపాలి. లేదంటే కోహ్లీనే మూడో నెంబర్లో రావాలి’ అని స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియా మాజీ లెజెండ్ మాథ్యూ హేడెన్ కూడా గంభీర్ అభిప్రాయంతో ఏకీభవించాడు. కోహ్లీ ఓపెనర్గా రావాల్సిన అవసరం లేదని, మూడో స్థానంలో అతను చాలా విలువైన ఆటగాడని అన్నాడు.