Abhishek Sharma : టీమిండియా (Team India) యువ క్రికెటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) కు ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) లో భారీ ఊరట లభించింది. సోషల్ మీడియా (Social Media) లో ఈ-కామర్స్ సైట్ల (E-commerce site) లో తన అనుమతి లేకుండా పేరును, ఫొటోలను వాడుకుంటూ కొందరు చేస్తున్న వ్యాపారాలకు, అసభ్యకర ప్రచారాలకు కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. అభిషేక్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ జ్యోతి సింగ్.. కీలక ఆదేశాలు జారీచేశారు.
అతని అనుమతి లేకుండా పేరు, ముఖచిత్రం, లేదా పర్సనాలిటీ రైట్స్ను కమర్షియల్ ప్రయోజనాల కోసం గానీ, సొంత ప్రచారం కోసం గానీ వాడకూడదని థర్డ్ పార్టీలపై కోర్టు నిషేధం విధించింది. అంతేకాదు ఇలాంటి అభ్యంతరకర లింకులను వెంటనే తొలగించాలంటూ మెటా ఆన్లైన్ ప్లాట్ఫామ్తోపాటు ఈ-కామర్స్ వెబ్సైట్లను ఆదేశించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను వాడుకుని కొందరు అభిషేక్ శర్మకు సంబంధించిన నకిలీ ఫొటోలు, వీడియోలను సృష్టిస్తున్నారు.
దీనిని సవాల్ చేస్తూ అభిషేక్ శర్మ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తాజా విచారణలో ఇది అతని గౌరవానికి, బ్రాండ్ వాల్యూకు నష్టం కలిగించేలా ఉన్నాయని అభిషేక్ తరఫు పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. కొంతమంది వెబ్సైట్లలో అతని మార్ఫింగ్ ఫొటోలపై అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నారని ఆరోపించారు. అతని అనుమతి లేకుండా అతని పేరు, ఫొటోలతో టీ-షర్టులు, బట్టలు తయారు చేసి ఆన్లైన్లో విక్రయిస్తున్నారని తెలిపారు.
దీనిపై స్పందించిన న్యాయమూర్తి జస్టిస్ జ్యోతి సింగ్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సృష్టించే ఇలాంటి నకిలీ కంటెంట్ను వ్యాప్తి చేయడం, అలాగే అతని పేరుతో అక్రమంగా దుస్తులు, వస్తువులు అమ్మడంపై నిషేధం విధించారు. అభిషేక్ శర్మ ప్రస్తుతం భారత జాతీయ జట్టులో కీలక ఆటగాడని, అంతర్జాతీయ క్రికెట్లో ఎదుగుతున్న ఒక ప్రభావవంతమైన వ్యక్తిగా గౌరవించాలని కోర్టు కోరింది. ఒక వ్యక్తికి పర్సనాలిటీ రైట్స్ (వ్యక్తిత్వ హక్కులు) ఉన్నప్పుడు, వారి అనుమతి లేకుండా వారి గుర్తింపును దుర్వినియోగం చేయకుండా రక్షణ పొందే హక్కు సదరు వ్యక్తికి ఖచ్చితంగా ఉంటుందని స్పష్టంచేశారు.