BCCI : భారత క్రికెట్ నియంత్రణ మండలి సెక్రటరీ జై షా(Jai Shah) ఐసీసీ అధ్యక్ష ఎన్నికలపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఐసీసీ కొత్త బాస్గా షా ఎన్నిక ఏకగ్రీమవ్వడం ఖాయమని సమాచారం. ఈ నేపథ్యంలో జై షా వారసుడు ఎవరు? అనే చర్చ మొదలైంది. అయితే.. ఢిల్లీ క్రికెట్ సంఘం(DCA) అధ్యక్షుడు రోహన్ జైట్లీ (Rohan Jaitley) సెక్రటరీ రేసులో అందరికంటే ముందున్నాడని టాక్.
మాజీ ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ కుమారుడైన రోహన్ బీసీసీఐ తదుపరి సెక్రటరీగా బాధ్యతలు చేపట్టడం లాంఛనమే అని వార్తలు వినిపిసిస్తున్నాయి. 2021లో డీసీఏకు జరిగిన ఎన్నికల్లో రోహన్ 1,658 ఓట్లు సాధించి సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ (Vikas Singh)పై గెలుపొందాడు.
విజయ సంకేతం చూపిస్తున్న రోహన్ జైట్లీ
అంతర్జాతీయ క్రికెట్ మండలి అధ్యక్ష ఎన్నికలకు వేళైంది. త్వరలోనే ఐసీసీ సభ్య దేశాలు కొత్త నాయకుడిని ఎన్నుకోనున్నాయి. ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్న గ్రెగ్ బార్క్లే (Greg Barclay) పదవీ కాలం నవంబర్లో ముగియనుంది. ఇప్పటికే రెండు పర్యాయాలు ఈ పదవిలో ఉన్న గ్రెగ్ ఇక వైదొలగాలని భావిస్తున్నాడు. అందువల్ల కొత్త బాస్ ఎంపిక అనివార్యమైంది. ఐసీసీ పీఠంపై జై షా కన్నేశాడని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అతడు పోటీలో నిలిస్తే కొత్త చీఫ్ ఎన్నిక ఏకగ్రీవం కావడం పక్కా అంటున్నారు విశ్లేషకులు.
ఐసీసీ అధ్యక్షపదవి కోసం నామినేషన్ వేసేందుకు ఆగస్టు 27వ తేదీ ఆఖరు. ఆలోపు ఆశావహులు తమ నామినేషన్లు పంపాలి. ఆ తర్వాత ఓటింగ్ ద్వారా కొత్త అధ్యక్షుడిని ఎన్నుంటారు. అయితే.. అందరి కళ్లు బీసీసీఐ సెక్రటరీ జై షా మీదే ఉన్నాయి. ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా కొనసాగుతున్న షా ఎన్నికల్లో ఏకపక్షంగా గెలుస్తాడని కొందరు అంటున్నారు. కానీ, ఈ వార్తలపై బీసీసీఐ కార్యదర్శి మాత్రం ఇంకా నోరు మెదపడంలేదు.