Jasia Akhtar : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఆడుతున్న జమ్మూకశ్మీర్కు చెందిన జసియా అక్తర్ జీవితంలో ఎన్నో కష్టాలు చవిచూసింది. అంతేకాదు ఉగ్రవాదుల బెదిరింపులు కూడా ఎదుర్కొన్నది. అయితే.. ఇవేవీ క్రికెటర్ కావాలన్న ఆమె కలను అడ్డు కోలేదు. బీసీసీఐ తొలిసారి నిర్వహిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో జసియా ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడుతోంది. ఈ లీగ్లో ఆడుతున్న తొలి జమ్మూ కశ్మీర్ ప్లేయర్ తనే కావడం విశేషం. అయితే.. 17 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనను ఆమె ఇప్పటికీ మర్చిపోలేదు.
జసియాది షోపియన్ జిల్లాలోని బ్రారి పొరా గ్రామం. ఐదుగురు తోబుట్టువుల్లో ఈమె పెద్దది. ఆమె తండ్రి మహమ్మద్ వన్సీ ఒక రైతు. క్రికెట్ను కెరీర్గా ఎంచుకున్న జసియాను ఉగ్రవాదులు చంపాలనుకున్నారు. ఒకరోజు వాళ్లు ఆమెను చుట్టుముట్టారు. జసియా తలపై తుపాకీ ఎక్కుపెట్టారు. అప్పుడు ఆమె తండ్రి.. ‘ఆమె భారత్కు ఆడదు. తనను విడిచి పెట్టండి’ అని వాళ్లను ప్రాధేయపడ్డాడు. దాంతో, దాదాపు ఐదేళ్లు జసియా తనకెంతో ఇష్టమైన క్రికెట్కు దూరమైంది. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన ఆమె 2011లో మళ్లీ బ్యాట్ అందుకుంది. ‘ఇప్పటికీ ఆ రోజు తలచుకుంటే నాకు భయం వేస్తుంది. డబ్ల్యూపీఎల్ తొలి సీజన్లో ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంద’ని జసియా తెలిపింది.
క్రికెటర్గా రాణించాలనుకున్న జసియాకు పేదరికం కష్టాలు అడుగడుగునా అవరోధంలా నిలిచాయి. షూ కొనేందుకు డబ్బులు లేకపోవడంతో చెప్పులతోనే ఆమె క్రికెట్ ప్రాక్టీస్ చేసేది. సొంత రాష్ట్రం మహిళలపై ఆంక్షలు ఉన్నందున ఆమె జమ్మూకశ్మీర్ తరఫున ఒకే ఏడాది ఆడింది. 2013 నుంచి పంజాబ్ జట్టకు ఆడడం మొదలెట్టింది. డబ్ల్యూపీఎల్ వేలంలో రూ. 20 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ జసియాను కొనుగోలు చేసింది. జసియా జీవతం గురించి తెలిసి పుమా బ్రాండ్ ఆమెకు స్పాన్సర్ చేసేందుకు ముందుకొచ్చింది. తొలి మ్యాచ్లో భారీ విజయం సాధించిన ఢిల్లీ ఈరోజు యూపీ వారియర్స్తో తలపడనుంది.