కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల ఫోర్స్ లాన్ బౌల్స్ జట్టు అదరగొట్టింది. ఈ మెగా టోర్నీలో తొలి పతకాన్ని ఖాతాలో వేసుకొని చరిత్ర సృష్టించింది. నార్తర్న్ ఐర్లాండ్ టీంతో జరిగిన ఫైనల్లో ఓటమి చవిచూసిన భారత జట్టు.. సిల్వర్ మెడల్ తన ఖాతాలో వేసుకుంది. ఈ జట్టులో సునీల్ బహదూర్, నవనీత్ సింగ్, చందన్ కుమార్ సింగ్, దినేష్ కుమార్ ఉన్నారు. భారత పురుషుల లాన్ బౌల్స్ జట్టుకు కామన్వెల్త్ క్రీడల్లో మెడల్ రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా, కొన్నిరోజుల క్రితమే భారత మహిళల లాన్ బౌల్స్ జట్టు ఏకంగా గోల్డ్ మెడల్ సాధించిన సంగతి తెలిసిందే.