చెన్నై: ‘ఒక్క మ్యాచ్ ఫలితంతో నా కెప్టెన్సీకి వచ్చిన ముప్పేం లేదు’ ప్రపంచకప్లో టీమ్ఇండియా మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ చేసిన వ్యాఖ్య ఇది. కానీ ఇప్పుడు అదే నిజమయ్యేలా కనిపిస్తున్నది. రోహిత్ సేన చేతిలో చావుదెబ్బ తిన్న పాక్.. ఆ తర్వత పేలవ ఆటతీరుతో ఆస్ట్రేలియాతో పాటు అఫ్గాన్ చేతిలోనూ పరాజయం పాలైంది. సోమవారం చెన్నై వేదికగా జరిగిన పోరులో పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్ చేతిలో ఓడింది. మొదట పాక్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 282 పరుగులు చేస్తే.. ఛేదనలో అఫ్గాన్ 49 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 286 పరుగులు చేసింది.
ఇబ్రహీం జద్రాన్ (87), రహ్మానుల్లా గుర్బాజ్ (65), రహ్మత్ షా (77 నాటౌట్), హష్మతుల్లా (48 నాటౌట్) రాణించారు. చెపాక్ స్టేడియంలో నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన అఫ్గాన్.. ప్రత్యర్థిని స్పిన్ ఉచ్చులో బిగించి ఉక్కిరి బిక్కిరి చేసింది. వన్డే క్రికెట్ చరిత్రలో అఫ్గాన్ జట్టుకు పాకిస్థాన్పై ఇదే తొలి విజయం కాగా.. 92 బంతుల్లో 74 పరుగులతో జిడ్డు ఆట ఆడిన బాబర్పై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అతడిని సారథ్య బాధ్యతల నుంచి తప్పించాలని ఆ దేశ మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో నాసిరకం ప్రదర్శన కనబర్చిన జట్టుపై సొంత దేశంలో అభిమానులు సై తం దుమ్మెత్తిపోస్తుంటే.. తదుపరి సారథిగా రిజ్వాన్, షాహీన్, సర్ఫరాజ్ పేర్లు తెరమీదకు వస్తున్నాయి. తాజా వరల్డ్కప్లో ఆడిన ఐదు మ్యాచ్ల్లో మూడింట ఓడిన పాకిస్థాన్ ఇక సెమీఫైనల్కు చేరాలంటే.. మిగిలిన మ్యాచ్లన్నీ గెలువక తప్పని పరిస్థితి నెలకొంది.