స్థానికులకు న్యాయం జరగాలనే ఉద్యమ నినాదాన్ని అమలుచేసేందుకు ప్రభుత్వం నూతన జోనల్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఎంతో శ్రమతో అత్యంత శాస్త్రీయ విధానాన్ని అనుసరించి రూపొందించిన జోనల్ వ్యవస్థకు కేంద్ర ఆమోదం లభించక ఇన్నాళ్లూ జాప్యం జరిగింది. ఇటీవలే రాష్ట్రపతి ఆమోదముద్ర వేయటంతో రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు అడ్డంకులు తొలగిపోయాయి. ఖాళీల భర్తీ ప్రక్రియను అధికారులు వెంటనే ప్రారంభించాలి.
–ముఖ్యమంత్రి కేసీఆర్
ప్రక్రియ వెంటనే మొదలుపెట్టండి డైరెక్ట్ రిక్రూట్మెంట్లు తొలి దశలో..ప్రమోషన్లతో ఏర్పడే ఖాళీలు రెండో దశలోఉద్యోగాల భర్తీపై సమీక్షలో సీఎం కేసీఆర్
హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ ): రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 50 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. తొలివిడతలో ఇప్పటికే గుర్తించిన 50 వేల పోస్టులను భర్తీచేయాలని, రెండో విడతలో ప్రమోషన్ల ద్వారా ఖాళీ అయ్యే పోస్టులను గుర్తించి భర్తీ చేయాలని సూచించారు. అన్ని శాఖల్లో ప్రమోషన్లను ఇప్పటికే ప్రారంభించినందున ఆయా శాఖల్లో ఖాళీ అయిన పోస్టులను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నూతన జోనల్ వ్యవస్థ రాష్ట్రపతి ఆమోదంతో ఇటీవలే అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి అధ్యక్షతన శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలోఉద్యోగాల భర్తీ అస్తవ్యస్తంగా ఉండేదని గుర్తుచేశారు. ‘స్థానికులకు న్యాయం జరగాలనే ఉద్యమ నినాదాన్ని అమలుచేసేందుకు ప్రభుత్వం నూతన జోనల్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఎంతో శ్రమతో అత్యంత శాస్త్రీయ విధానాన్ని అనుసరించి రూపొందించిన జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోదం లభించడంలో ఇన్నాళ్లు జాప్యం జరిగింది. ఇటీవలే రాష్ట్రపతి ఆమోదముద్ర వేయటంతో రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు అడ్డంకులు తొలగిపోయాయి’ అని సీఎం కేసీఆర్ అన్నారు. ఖాళీల భర్తీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. నేరుగా భర్తీచేసే అవకాశాలున్న (డైరెక్ట్ రిక్రూట్మెంట్) అన్ని రకాల ఉద్యోగాలు కలుపుకొంటే 50వేల దాకా ఉన్నాయని, వాటిని ముందుగా భర్తీ చేస్తామని సీఎం ప్రకటించారు. ప్రమోషన్ల ద్వారా ఏర్పడిన ఖాళీలకు సంబంధించిన పూర్తి సమాచారంతో నివేదికను ఈ నెల 13న జరిగే క్యాబినెట్ సమావేశంలో సమర్పించాలని అధికారులను ఆదేశించారు.