అంచనాలు లేని క్రీడలో భారత మహిళల జట్టు సంచలనం సృష్టించింది. లాన్బౌల్స్లో పసిడి పతకం నెగ్గి నయా చరిత్ర లిఖించింది. కామన్వెల్త్ క్రీడల లాన్బౌల్స్లో మనకు ఇదే తొలి పతకం కాగా.. టేబుల్ టెన్నిస్లో పురుషుల జట్టు పసిడి వెలుగులు విరజిమ్మింది. వెయిట్ లిఫ్టింగ్లో వికాస్ రజత పతకం గెలుచుకోగా.. హర్జిందర్ కౌర్ కాంస్యం చేజిక్కించుకుంది. అథ్లెటిక్స్లో శ్రీశంకర్, అనీస్ ఫైనల్ చేరగా.. మహిళల హాకీ జట్టుకు తొలి పరాజయం ఎదురైంది.
బర్మింగ్హామ్: లాన్బౌల్స్లో భారత మహిళల జట్టు స్వర్ణం సాధించి నయా చరిత్ర లిఖించింది. ఏమాత్రం అంచనాలు లేని క్రీడలో భారత అథ్లెట్లు అదుర్స్ అనిపించారు. లవ్లీ చౌబే, రూపారాణి టిర్కి, పింకీ, నయన్మోని సైకియాతో కూడిన భారత బృందం మంగళవారం జరిగిన ఫైనల్లో 17-10తో దక్షిణాఫ్రికాపై చిరస్మరణీయ విజయం సాధించింది. ఏడు దశాబ్దాలుగా కామన్వెల్త్లో కొనసాగుతున్న ఈ క్రీడలో.. భారత్ 2010 నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నది.
లాన్ బౌల్స్లో ఇప్పటి వరకు నాలుగో స్థానంలో నిలువడంతో భారత్కు అత్యుత్తమం కాగా.. తాజాగా మన మహిళల జట్టు పసిడి పతకం సాధించి శభాష్ అనిపించుకుంది. సెమీస్లో న్యూజిలాండ్ను చిత్తుచేసిన మనవాళ్లు.. తుది పోరులో సఫారీలపైనా అదే జోరు కనబర్చారు. ఒక దశలో భారత్ 8-2తో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చినా.. కాసేపటికే దక్షిణాఫ్రికా తిరిగి పుంజుకోవడంతో పోరు 8-8తో రసవత్తరంగా మారింది. అయితే చివరి వరకు పట్టు కొనసాగించిన మన జట్టు.. కీలక సమయాల్లో పాయింట్లు సాధించి ముందంజ వేసింది.
ఈ పతకంతో దేశంలో లాన్ బౌల్స్కు మంచి గుర్తింపు దక్కుంతుందని లవ్లీ పేర్కొంది. జట్టు కోసం కాకుండా దేశం కోసం మెడల్ సాధించాలని బరిలోకి దిగినట్లు ఆమె చెప్పింది. ఇన్నాళ్లు పడ్డ కష్టానికి దక్కిన ఫలితమిదని జట్టు సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. లాన్బౌల్స్తో పాటు టేబుల్ టెన్నిస్ (టీటీ), వెయిట్ లిఫ్టింగ్లో పతకాలు సాధించిన ప్లేయర్లను ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు.
భారత్ 1-3 ఇంగ్లండ్
తొలి రెండు మ్యాచ్ల్లో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన భారత మహిళల హాకీ జట్టుకు.. మూడో మ్యాచ్లో పరాజయం ఎదురైంది. పూల్-‘ఏ’లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో మన అమ్మాయిలు 1-3 తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలయ్యారు. మ్యాచ్ ప్రారంభమైన మూడో నిమిషంలోనే తొలి గోల్ కొట్టిన ఇంగ్లండ్ ఆద్యంతం పైచేయి కనబర్చగా.. మ్యాచ్ ముగియడానికి కొన్ని క్షణాల ముందు భారత్ తరఫున వందనా కటారియా (60వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించింది. కామన్వెల్త్ తొలి మ్యాచ్లో మన అమ్మాయిలు ఘనాపై 5-0తో.. రెండో పోరులో వేల్స్పై 3-1తో విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఫైనల్లో అద్వైత్, శ్రీహరి
బర్మింగ్హామ్ ఈతకొలనులో బోణీ కొట్టేందుకు భారత స్విమ్మర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పురుషుల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్లో అద్వైత్, కుషాగ్ర రావత్ ఫైనల్కు అర్హత సాధించారు. హీట్-1లో భాగంగా అద్వైత్ 15:39.25 సెకన్లలో లక్ష్యాన్ని చేరగా.. హీట్-2లో కుషాగ్ర 15:47.77 సెకన్లతో ఫైనల్లో అడుగుపెట్టాడు. మరోవైపు పురుషుల 200 మీటర్ల బ్యాక్స్ట్రోక్లో శ్రీహరి నటరాజన్ ఫైనల్కు చేరలేకపోయాడు. సెకన్లో 20 వంతుతో అవకాశాన్ని చేజార్చుకున్నాడు.
మరోవైపు లాంగ్జంప్లో మురళీ శ్రీశంకర్, అనీస్ యహియా.. మహిళల షాట్పుట్లో మన్ప్రీత్ కౌర్ ఫైనల్కు చేరారు.
ఎలా ఆడతారంటే..
పచ్చిక మైదానంలో ఆడే ఈ ఆటలో బౌల్స్గా పిలిచే పెద్ద సైజు బంతులతో పాటు.. ‘ది జాక్’అనే చిన్న బంతి ఉంటుంది. టాస్ వేసి ముందు ఎవరు బౌల్ చేస్తారో, ఎవరు జాక్ విసురుతారో నిర్ణయిస్తారు. ఒక జట్టుకు చెందిన ఆటగాళ్లు అండర్ ఆర్మ్ త్రో ద్వారా తొలుత జాక్ను విసిరితే.. ప్రత్యర్థి జట్టు బౌల్స్తో దాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. ఇందులో సింగిల్స్, డబుల్స్తో పాటు టీమ్ గేమ్ ‘ఫోర్స్’ఫార్మాట్లు ఉంటాయి. ఇప్పుడు భారత మహిళల జట్టు స్వర్ణం నెగ్గింది ఈ ‘ఫోర్స్’విభాగంలోనే. ఈ ఫార్మాట్లో ఒక్కో జట్టు ఒక్కో రౌండ్ (ఎండ్)లో ఎనిమిది త్రోలు విసురుతుంది. ఇలాంటివి మొత్తం 18 రౌండ్లు ఉంటాయి. జాక్కు సాధ్యమైనంత దగ్గరగా బౌల్ వేయడం ద్వారా ఫలితాన్ని నిర్దేశిస్తారు.
హర్జిందర్కు కాంస్యం
మహిళల వెయిట్ లిఫ్టింగ్ 71 కేజీల విభాగంలో హర్జిందర్ కౌర్ కాంస్య పతకంతో మెరిసింది. సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన పోటీల్లో హర్జిందర్ 212 కేజీల (93+119) బరువెత్తి మూడో స్థానంలో నిలిచింది. సారా (229; ఇంగ్లండ్), అలెక్సిస్ (214; కెనడా) వరుసగా స్వర్ణ, రజతాలు దక్కించుకున్నారు. బర్మింగ్హామ్ క్రీడల్లో కాంస్యం సాధించిన హర్జిందర్ కౌర్కు పంజాబ్ ప్రభుత్వం రూ. 40 లక్షల నజరానా ప్రకటించింది.
గడ్డి కోసిన చేతులతో..
గడ్డికోసే యంత్రం వల్ల రాటుదేలిన చేతులతోనే కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం నెగ్గానని హర్జిందర్కౌర్ చెప్పింది. పంజాబ్లోని నభా ప్రాంతానికి చేరిన హర్జిందర్కౌర్.. తండ్రితో కలిసి పశువులకు గడ్డివేసే క్రమంలో యంత్రాన్ని గట్టిగా తిప్పాల్సి వచ్చేదని.. దాని వల్లే చేతులు బలంగా మారాయని పేర్కొంది. నాలుగేళ్ల క్రితమే లిఫ్టింగ్ వైపు అడుగులు వేసిన హర్జిందర్.. బరిలోకి దిగిన తొలి కామన్వెల్త్ క్రీడల్లోనే పతకంతో సత్తాచాటడం విశేషం.
టీటీలో పసిడి
డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత పురుషుల టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్టు.. కామన్వెల్త్ గేమ్స్లో అదరగొట్టింది. మంగళవారం హోరాహోరీగా సాగిన పోరులో భారత్ 3-1తో సింగపూర్ను చిత్తు చేసి వరుసగా రెండోసారి పసిడి పతకం కైవసం చేసుకుంది. తుది పోరులో మొదట జరిగిన డబుల్స్లో హర్మీత్ దేశాయ్-సాతియాన్ జంట 13-11, 11-7, 11-5తో ప్రత్యర్థి జోడీపై ఏకపక్ష విజయం సాధించగా.. సింగిల్స్లో భారత సీనియర్ ప్లేయర్ శరత్ కమల్ 7-11, 14-12, 3-11, 9-11తో క్లారెన్స్ చేతిలో ఓటమి పాలయ్యాడు. అనంతరం జరిగిన సింగిల్స్లో సాతియాన్, హర్మీత్ దేశాయ్ వరుస విజయాలు సాధించడంతో భారత్ స్వర్ణం చేజిక్కించుకుంది. 2002 మాంచెస్టర్ క్రీడల నుంచి కామన్వెల్త్లో టేబుల్ టెన్నిస్ను ప్రవేశ పెట్టగా.. మనవాళ్లు ఓవరాల్గా ఏడో స్వర్ణం ఖాతాలో వేసుకున్నారు. శరత్ కమల్కు ఇది 10వ కామన్వెల్త్ పతకం కావడం విశేషం.
వెండి వికాస్
భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ వికాస్ ఠాకూర్ కామన్వెల్త్ గేమ్స్లో హ్యాట్రిక్ నమోదు చేసుకున్నాడు. తాజా పోటీల్లో 96 కేజీల విభాగంలో బరిలోకి దిగిన వికాస్ 346 కేజీలు (155+191) ఎత్తి రజత పతకం కైవసం చేసుకున్నాడు. 2014 గ్లాస్గో క్రీడల్లో రజతం నెగ్గిన వికాస్.. 2018 గోల్డ్కోస్ట్లో కాంస్యం గెలుచుకున్నాడు. డాన్ ఒపెలాగ్ 381 (171+210), తనైలా రైనిబొగి 343 (155+188) వరుసగా స్వర్ణ, కాంస్యాలు చేజిక్కించుకున్నారు. క్లీన్ అండర్ జర్క్లో 191 కేజీలు ఎత్తిన అనంతరం పంజాబ్ దివంగత సింగర్ సిద్ధూ మూసెవాలాను తలుచుకుంటూ తొడగొట్టి సంబురాలు జరుపుకున్న వికాస్.. మూడో ప్రయత్నంలో తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన కన్నా ఓ కేజీ ఎక్కువ (198 కేజీలు) ఎత్తేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. తన తల్లి పుట్టినరోజు నాడు పతకం నెగ్గడం సంతోషంగా ఉందన్న వికాస్.. దీన్ని ఆమెకే అంకితమిస్తున్నట్లు పేర్కొన్నాడు. ‘కామన్వెల్త్లో మూడో మెడల్ గెలువడం ఆనందంగా ఉంది. దీన్ని మా అమ్మ (ఆశాదేవి)కు అంకితమిస్తున్నా. ప్రపంచ స్థాయి అందుకునేందుకు అహర్నిశలు శ్రమించాల్సిందే’అని పతకం నెగ్గిన అనంతరం వికాస్ పేర్కొన్నాడు.