హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): విశ్వక్రీడా వేదికపై భారత కీర్తి పతాకం ఎగరాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. టోక్యోలో శుక్రవారం ప్రారంభమైన 32వ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొంటున్న భారత ప్లేయర్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ దేశాలు పాల్గొనే ఒలింపిక్స్ క్రీడలు విశ్వానికి శాంతి సౌభ్రాతృత్వాలను విరజిమ్మే ఆటల సింగిడికి ప్రతిరూపంగా నిలుస్తాయని అభివర్ణించారు. ఒలింపిక్స్ క్రీడల్లో విజయాలు సాధించి, స్వర్ణాలతో పాటు పలు పతకాలు గెలిచేలా క్రీడాకారులకు శుభం జరుగాలని సీఎం కోరుకున్నారు.