న్యూఢిల్లీ: సఫారీ గడ్డపై ఇప్పటి వరకు టెస్టు సిరీస్ నెగ్గని టీమ్ఇండియా.. ఈసారి ఆ లోటు భర్తీ చేసుకోవాలని చూస్తున్నది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈ నెల 26 నుంచి సెంచూరియన్ వేదికగా తొలి (బాక్సింగ్ డే) టెస్టు ప్రారంభం కానుండగా.. ఇప్పటికే సఫారీ గడ్డపై అడుగుపెట్టిన కోహ్లీ సేన సీరియస్గా ప్రాక్టీస్ చేస్తున్నది. గత రెండు రోజులుగా నెట్స్లో చెమటోడుస్తున్న భారత ఆటగాళ్లు.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో లోపాలను సవరించుకోవడంలో నిమగ్నమైతే.. టీమ్ మేనేజ్మెంట్ మాత్రం కూర్పుపై కసరత్తు చేస్తున్నది. ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించనున్న పిచ్లపై పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్కు అవకాశమిస్తారా.. లేక ఎక్స్ట్రా బ్యాటర్గా అజింక్యా రహానే, హనుమ విహారిల్లో ఒకరిని ఎంపిక చేస్తారా చూడాలి. సాధారణంగా ఐదుగురు బౌలర్ల ప్లాన్కే మొగ్గుచూపే విరాట్ కోహ్లీ.. బౌన్సీ పిచ్పై రహానే అనుభవం పనికొస్తుందని భావిస్తాడా చూడాలి. జట్టు కూర్పుపై సెలెక్షన్ కమిటీ మాజీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగాలనుకుంటే శార్దూల్ ఠాకూర్ మంచి ఎంపిక అని నా అభిప్రాయం. అతడైతే ఏడో స్థానంలో బ్యాటింగ్ చేయగలడు. దీంతో పాటు అశ్విన్ కూడా ఉంటాడు కాబట్టి ఇబ్బంది ఉండదు. బుమ్రా, షమీతో పాటు మహమ్మద్ సిరాజ్ను జట్టులోకి తీసుకోవడమే మేలు. ప్రస్తుత పరిస్థితుల్లో సిరాజ్ను కాదని ఇషాంత్కు చాన్స్ ఇస్తారని అనుకోవడం లేదు’ అని పేర్కొన్నాడు. సోమవారం భారత ఆటగాళ్లు రహానే, పుజారా, పంత్, కోహ్లీ ప్రధాన గ్రౌండ్లోని సెంటర్ వికెట్పై ప్రాక్టీస్ చేసిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇందులో ‘తీవ్రతతో కూడిన నాణ్యమైన శిక్షణ’ అని ద్రవిడ్ అంటే.. వికెట్పై గడ్డి ఎక్కువగా ఉందని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు.