World Athletics Championships : ఆసియా దేశం చైనా మరో ప్రతిష్ఠాత్మక టోర్నీకి ఆతిథ్యమివ్వనుంది. నిరుడు 19వ ఆసియా క్రీడ(Asian Games)లను నిర్వహించిన చైనా తాజాగా వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్ -2027 (World Athletics Championships)హక్కులను దక్కించుకుంది. ఈ విషయాన్ని గురువారం వరల్డ్ అథ్లెటిక్స కౌన్సిల్ వెల్లడించింది. దాదాపు రెండు దశాద్దాల తర్వాత సమ్మర్ ఒలింపిక్స్ 2008, వింటర్ గేమ్స్ 2022ను బీజింగ్ విజయవంతంగా నిర్వహించింది.దాంతో, గ్లాస్గోలో జరిగిన 234వ ప్రపంచ అథ్లెటిక్స్ కౌన్సిల్ సమావేశంలో బీజింగ్కు 2027లో జరుగబోయే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్ హక్కులు కట్టబెట్టాలని నిర్ణయించింది.
‘ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్ హక్కులు దక్కించుకున్నందుకు బీజింగ్కు అభినందనలు. పుష్కర కాలం తర్వాత చైనాలో 15వ ఎడిషన్ పోటీలు జరుగనున్నాయి. నిరుడు వాండా డైమండ్ లీగ్ బ్రాడ్కాస్ట్ను చైనాలో 3,689 మిలియన్ల మంది చూశారు. గతంలో వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్ పోటీలకు అతిథ్యమిచ్చిన నాలుగు దేశాలు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగినవే. ఇప్పుడు ఆ జాబితాలో చైనా చేరింది. ఇంతకుముందు అమెరికా, యూరోపియన్ యూనియన్, జపాన్లు ఈ పోటీలకు ఆతిథ్యమిచ్చాయి’ అని వరల్డ్ అథ్లెటిక్స్ అధ్యక్షుడు సెబాస్టియన్ కొయె(Sebastian Coe) ఓ ప్రకటనలో తెలిపాడు.
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్ కంటే ముందే చైనా మరో రెండు పోటీలకు ఆతిథ్యమిస్తోంది. నాన్జింగ్ నగరంలో వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్(World Indoor Athletics Championships), ఈ ఏడాది ఏప్రిల్లో షాంఘై, గ్జియాబెన్ పట్టణాల్లో డైమండ్ లీగ్(Diamond League 2024) టోర్నీలు జరుగనున్నాయి.