గుజరాత్ – 608 cr
ఉత్తరప్రదేశ్ – 503 cr
కర్ణాటక – 128 cr
హర్యానా – 89 cr
ఆంధ్రప్రదేశ్ – 33.8 cr
తమిళనాడు – 33 cr
తెలంగాణ – 24.11 cr
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం : దేశానికి దిక్సూచిగా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళుతున్న తెలంగాణపై కేంద్రం పక్షపాత ధోరణి కొనసాగుతున్నది. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో విప్లవాత్మక నిర్ణయాలతో మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్రంపై బీజేపీ సారథ్యంలోని కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నది. కీలకమైన రంగాల్లోనే కాదు క్రీడల్లోనూ కేంద్ర ప్రభుత్వ వివక్ష పూరిత వైఖరి విస్మయానికి గురిచేస్తున్నది. కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఖేలో ఇండియా స్కీమ్ నిధుల కేటాయింపుల్లోనూ అదే వైఖరి కొనసాగించింది.
తమ పార్టీ అధికారంలో ఉన్న గుజరాత్, ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటకకు లెక్కకు మిక్కిలి నిధులు కేటాయించిన మోదీ సర్కార్ విపక్ష రాష్ర్టాలపై కక్ష కట్టింది. క్రీడల్లో అంతంత మాత్రం ప్రాతినిధ్యం ఉండే గుజరాత్కు ఏకంగా 608 కోట్లు నిధులిస్తే..తెలంగాణకు 24 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. మొత్తంగా చూస్తే దక్షిణాది రాష్ర్టాలు(తెలంగాణ, ఆంధప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి) అన్నింటికి కలిపి 296 కోట్లు ఇస్తే..ఒక్క గుజరాత్కే అంతకు రెండింతలు దక్కడం వివక్షకు అద్దం పడుతున్నది.
కేటాయింపుల్లో అగ్రభాగం(1100 కోట్లు) దక్కించుకున్న గుజరాత్, ఉత్తరప్రదేశ్.. ఇటీవల బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో ఘోరంగా విఫలమయ్యాయి. పతకాల సాధనలో హర్యానా(23), తెలంగాణ(6) టాప్-2లో ఉంటే గుజరాత్ రెండు, యూపీ ఐదు పతకాలకు పరిమితమయ్యాయి. పతకాలు సాధిస్తున్న రాష్ర్టాలకు అండగా నిలువాల్సిన కేంద్రం..తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాలకు నిధుల వరద పారించడంపై పలువురు క్రీడాభిమానులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, మాజీ ప్లేయర్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నిధుల కేటాయింపులో నక్కకు నాగలోకానికి తేడా అన్నట్లు గుజరాత్కేమో ఘనంగా నిధులు కుమ్మరించిన కేంద్రం..తెలంగాణకు మొండిచేయి చూపడాన్ని ఆక్షేపించారు. వివక్షను ఎంత మాత్రం సహించేది లేదంటూ ముక్తకంఠంతో ఖండించారు.
ఖేలో ఇండియా స్కీమ్ కింద కేంద్రం కేటాయించిన నిధులు చూస్తే ముక్కు మీద వేలేసుకోవాల్సిందే. గుజరాత్కు పెద్దపీట వేస్తూ 608 కోట్లు కేటాయించిన మోదీ ప్రభుత్వం.. దక్షిణాది రాష్ర్టాలపై శీతకన్ను వేసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేయడంలో ముందుంటున్న తెలంగాణ సహా తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్కు నామమాత్రపు నిధులతో మమ అనిపించింది. కేంద్రం నుంచి భారీగా నిధులు పొందిన రాష్ర్టాల్లో గుజరాత్ తర్వాత ఉత్తరప్రదేశ్ (503 కోట్లు), అరుణాచల్ప్రదేశ్ (188 కోట్లు), కర్ణాటక (128 కోట్లు) ముందువరుసలో ఉంటే.. దేశానికి లెక్కకు మిక్కిలి పతకాలు అందిస్తున్న తెలంగాణ (24.11 కోట్లు), ఆంధ్రప్రదేశ్ (33 కోట్లు), పశ్చిమబెంగాల్ (26.77 కోట్లు), తమిళనాడు (33 కోట్లు)కు నిరాశే ఎదురైంది. బాక్సింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్లో అపార ప్రతిభ కనబరుస్తున్నా.. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపడం తగదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వైఖరి సరైంది కాదు
ఇదిలా ఉంటే పలువురు క్రీడాభిమానులు, మాజీ ఒలింపియన్లు, కోచ్లు, క్రీడా సంఘాల ప్రతినిధులు కేంద్రం ధోరణిని తీవ్రంగా ఆక్షేపించారు. ప్రతిభను ప్రోత్సహించాల్సింది పోయి ఇలా నిధుల విషయంలో తెలంగాణను చిన్నచూపు చూడటంపై వారు భగ్గుమంటున్నారు. అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణకు అండగా నిలువాల్సింది పోయి..కాళ్లలో కట్టె పెట్టినట్లు చేస్తున్న కేంద్రంపై వారు విరుచుకుపడుతున్నారు. మిగతా రంగాలతో పాటు క్రీడల్లోనూ కేంద్ర ప్రభుత్వం వివక్ష పూరిత ధోరణి విడనాడకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ సోషల్మీడియాలో కేంద్రం తీరును తూర్పారపట్టగా తాజాగా క్రీడాభిమానులు, అధికారులు, కోచ్లు, ప్లేయర్లు తన నిరసన గళాన్ని వినిపిస్తున్నారు.
ముమ్మాటికీ వివక్షే..
ఖేలో ఇండియాస్కీమ్ నిధుల్లో తెలంగాణపై కేంద్రం పక్షపాత ధోరణిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. బీజేపీ పాలిత రాష్ర్టాలతో పోల్చుకుంటే దక్షిణాది రాష్ర్టాలకు నిధుల కేటాయింపులో కేంద్రం చాలా వివక్ష ప్రదర్శించింది. తెలంగాణకు మిగతా రంగాలతో పాటు క్రీడల్లోనూ కేంద్రం ఇదే వైఖరి ప్రదర్శించడం హర్షించదగ్గ పరిణామం కాదు. నిధుల కేటాయింపులో సమతూకం పాటించాల్సింది పోయి.. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాలకు నిధులు భారీగా ఇచ్చి.. విపక్ష పార్టీలకు చెందిన రాష్ర్టాలకు మొండిచేయి చూపించారు. – శ్రీధర్రెడ్డి, టీఎస్ఈడబ్యూఐడీసీ చైర్మన్
తెలంగాణపై చిన్నచూపు
ఖేలో ఇండియా స్కీమ్లో తెలంగాణకు నిధులు కేటాయించడంలో కేంద్రం చాలా చిన్నచూపు చూసింది. బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, బాక్సింగ్ లాంటి క్రీడలకు అడ్డాగా ఉన్న తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తున్నది. కండ్లు ఉండి కూడా సరిగ్గా చూడలేకపోతున్న కేంద్రం వైఖరి సరైంది కాదు. దేశానికి పతకాలు అందిస్తున్న ప్లేయర్లను ప్రోత్సహించాల్సింది పోయి మొండిచేయి చూపిస్తున్నది. అథ్లెటిక్స్లో మంచి ఫలితాలు ఇస్తున్నా..గచ్చిబౌలి స్టేడియంతో పాటు మెదక్లో వసతులను మెరుగుపర్చడంలో సాయ్ శ్రద్ధ కనబర్చడం లేదు. గుజరాత్కు 600 కోట్లు ఇచ్చి తెలంగాణకు 24 కోట్లు కేటాయించడంలో వివక్ష కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. కేంద్రం ఈ వైఖరి మార్చుకోకపోతే అందుకు తగ్గ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
– జగన్మోహన్రావు, జాతీయ హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు
కేంద్రం దృక్పథం మారాలి
క్రీడా రంగం అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వ దృక్పథం మారాలి. ఖేలో ఇండియా స్కీమ్ నిధుల కేటాయింపులో కేంద్రం..తెలంగాణపై చిన్నచూపు చూడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశానికి పతకాలు అందించడంలో ముందుంటున్న తెలంగాణకు సహకారం అందించాల్సింది పోయి..వివక్ష పూరిత వైఖరి ప్రదర్శించడం సరైంది కాదు. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధి చెందుతున్నది. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రాంగణాలను నెలకొల్పుతున్నాం. అత్యుత్తమ క్రీడా సౌకర్యాలు కల్పిస్తూ వారి ప్రతిభకు పట్టం కడుతున్నాం. ఒకవేళ కేంద్రం తెలంగాణపై ఇదే వైఖరి కొనసాగిస్తే..కసితో రానున్న రోజుల్లో మరింత కష్టపడి పతకాలు సాధించి మా సత్తా ఏంటో దేశానికి చూపిస్తాం.
– వెంకటేశ్వర్రెడ్డి, సాట్స్ చైర్మన్