Jasprit Bumarh : రాజ్కోట్ టెస్టులో ఇంగ్లండ్పై ఘన విజయం సాధించిన రోహిత్ సేన ఐదు టెస్టుల సిరీస్లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. అన్ని విభాగాల్లో అదరగొట్టి స్టోక్స్ బృందాన్ని మట్టికరిపించింది. రాంచీ(Ranchi)లో జరిగే నాలుగు టెస్టుకు ఇదే ఉత్సాహంతో టీమిండియా సిద్ధమవుతోంది. అయితే.. ఈ టెస్టుకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumarh) దూరం కానున్నాడు. అతడిపై ఒత్తిడిని తగ్గించేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
రాజ్కోట్ నుంచి భారత జట్టు మంగళవారం రాంచీకి వెళ్లనుంది. బుమ్రా మాత్రం సోమవారమే అహ్మదాబాద్ బయలేదేరనున్నాడు. అయితే.. అతడి స్థానంలో ఎవరు ఆడుతారు? అనేది మాత్రం బీసీసీఐ ఇంకా చెప్పలేదు. మరో విషయం ఏంటంటే.. ఈ యార్కర్ కింగ్ ఆఖరి టెస్టుకు కూడా దూరమవుతాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. నాలుగో టెస్టు ఫలితాన్ని బట్టి బుమ్రా ఆఖరి టెస్టు ఆడడంపై కెప్టెన్, మేనేజ్మెంట్ ప్రకటన చేయనుందని సమాచారం.
జస్ప్రీత్ బుమ్రా
ఉప్పల్ టెస్టులో దారుణంగా ఓడిన భారత్ వైజాగ్ టెస్టులో దుమ్మురేపింది. యశస్వీ జైస్వాల్ డబుల్ సెంచరీతో కదం తొక్కగా.. బుమ్రా తన మ్యాజిక్ స్పెల్తో ఇంగ్లండ్ నడ్డి విరిచాడు. 9 వికెట్లు తీసి పర్యాటక జట్టు ఆనందాన్ని ఆవిరి చేశాడు. దాంతో ఈ స్పీడ్స్టర్కు విశ్రాంతినివ్వాలని కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రవిడ్ భావించారు. కానీ, మరో పేసర్ ముకేశ్ కుమార్ తేలిపోతుండడం, సిరీస్లో కీలకమైన టెస్టు కావడంతో బుమ్రాను రాజ్కోట్లో ఆడించారు. మ్యాచ్లో బుమ్రా కీలక సమయాల్లో వికెట్లు తీసి స్టోక్స్ సేనను దెబ్బకొట్టాడు. అనంతరం స్పిన్నర్ జడేజా 5 వికెట్ల ప్రదర్శనతో భారత్ 434 పరుగుల భారీ విజయం నమోదు చేసింది. నాలుగో టెస్టు ఫిబ్రవరి 23న రాంచీలో జరుగనుంది. రంజీ మ్యాచ్ కోసం జట్టును వీడిన ముకేశ్ ఆలోపు రోహిత్ బృందంతో కలువనున్నాడు.