Khilla Ramalayam | డిచ్పల్లి, ఫిబ్రవరి 18 : చరిత్రకు ప్రతిబింబం ‘ఖిల్లా రామాలయం’..చక్కని కళాత్మక శిల్పాలు, శతాబ్దాల కిందటి కళాచాతుర్యానికి, చరిత్రకు ప్రతిబింబంగా నిలుస్తున్నది. 16వ శతాబ్దంలో డిచ్పల్లి గ్రామానికి 50అడుగుల ఎత్తులో ఉన్న గుట్టపై ఈ రామాలయాన్ని నిర్మించారు. ద్వారాలపై ఉన్న నగిషీ గోపురాల మీద ద్రావిడుల సంప్రదాయ ప్రభావం కనిపిస్తున్నది. విజయనగర రాజుల శిల్పరీతిని చూపుతున్నది. ఆలయంలో 1947వ సంవత్సరం వరకు విగ్రహాలు ఉండేవికావు. డిచ్పల్లికి చెందిన గజవాడ చిన్నయ్య అప్పట్లో రాజస్థాన్ నుంచి సీతారామలక్ష్మణుల పాలరాతి విగ్రహాలను తెప్పించి ప్రతిష్టింపజేశారు. అప్పటి నుంచి ఈ చారిత్రాత్మక శిల్పకళా నిలయం రామాలయంగా ప్రసిద్ధిగాంచింది. గర్భగుడి మధ్యభాగంలో ఎత్తయిన రాతిసింహాసం ఉన్నది. ఆలయ గోడలపై గజకేసరి (ఏనుగు సింహాలు) చిత్రాలు మలచబడి ఉన్నాయి. 1971 వరకు డిచ్పల్లి సర్పంచ్గా ఉన్న గజవాడ చిన్నయ్య రామాలయ అభివృద్ధి కోసం కృషిచేశారు. నిత్యనైవేద్యం, పూజలు చేసేందుకు పూజారిని నియమించారు. పూజారి జీవనోపాధికి రెండు ఎకరాల భూమిని దేవాలయం పేర ఏర్పాటు చేశారు. ఆలయం కింద కుడివైపున రెండువందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువును కూడా కాకతీయుల కాలంలోనే నిర్మించారు. చెరువు మధ్యలో ఉన్న మంటపం చూపరులకు ముచ్చట గొలుపుతున్నది. ఇక్కడ ప్రతిఏటా తెప్పోత్సవం నిర్వహించారు.
రాములోరు పక్షం రోజులు నివసించిన నేల..చారిత్రాత్మక నిలయం.. దీక్షానగరిగా పేరొందిన డిచ్పల్లి ఖిల్లా రామాలయం ఉత్సవాలకు ముస్తాబయ్యింది. వారం రోజులపాటు నిర్వహించే తిరుకల్యాణోత్సవాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. సోమవారం సాయంత్రం పుణ్యహవాచనం, అంకురార్పణ, ముత్సంగ్రహం, అఖండ దీపారాధనతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు మొదలుకానున్నాయి. వేడుకలను పురస్కరించుకొని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబుచేశారు.
ప్రతిఏటా మాఘశుద్ధి ఏకాదశి ఉంచి పాడ్యమి వరకు దేవాలయంలో ఉత్సవాలు జరుగుతాయి. త్రయోదశి రోజు సీతారాముల కల్యాణం నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకం. శ్రీరామనవమితో సహా సంవత్సరానికి రెండుసార్లు వైభవోపేతంగా జరిగే స్వామివారి కల్యాణోత్సవాలకు అశేషంగా భక్తులు హాజరై తరిస్తారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజు రథోత్సవం నిర్వహిస్తారు. ఉత్సవ విగ్రహాలను డిచ్పల్లి మండలకేంద్రంలో ఊరేగిస్తారు.
తిరుకల్యాణోత్సవాలకు ఖిల్లా రామాలయంలో ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ జం గం శాంతయ్య, గ్రామపెద్దలు పేర్కొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతి రోజూ విశేష పూ జలు నిర్వహించనున్నట్లు ప్రధా న అర్చకులు సుమిత్ శర్మ దేశ్పాండే తెలిపారు. వేడుకలకు ప్రముఖులు హాజరవుతారని, రథోత్సవం రోజు రూరల్ ఎమ్మె ల్యే డాక్టర్ భూపతిరెడ్డి రానున్నట్లు పేర్కొన్నారు.