SKM | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమ విరమణ సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఆందోళనకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ నెల 21న బీజేపీతో సహా అధికార ఎన్డీయే పక్ష ఎంపీలకు వ్యతిరేకంగా నల్లజెండాలతో నిరసనలు తెలుపాలని రైతులకు సూచించింది. మరోవైపు పంజాబ్లో బీజేపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షుల ఇండ్ల ముందు ఈనెల 20 నుంచి 22 వరకు మూడు రోజుల పాటు 24 గంటల ఆందోళన కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఎస్కేఎం ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నది.
పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తామని బీజేపీ 2014 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని, అయితే మోదీ సర్కార్ మోసం చేస్తున్నదని విమర్శించింది. ఈనెల 21న ఉత్తరప్రదేశ్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాక్టర్ల మార్చ్ నిర్వహించనున్నట్టు బీకేయూ ప్రకటించింది. రైతుల ఆందోళనకు మద్దతుగా 26, 27 తేదీల్లో రైతులు తమ ట్రాక్టర్లను ఢిల్లీకి వెళ్లే హైవేలపై పార్క్ చేస్తారని తెలిపింది. ట్రాక్టర్ల ర్యాలీలో భారీయెత్తున రైతులు పాలుపంచుకోవాలని రైతు నేత రాకేశ్ టికాయిత్ పిలుపునిచ్చారు. మరోవైపు, రైతుల చలో ఢిల్లీ మార్చ్ ఆదివారం ఆరో రోజుకు చేరుకున్నది. పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో వందల మంది రైతులు నిరసన కొనసాగిస్తున్నారు.
తాజాగా మరోసారి రైతాంగం ఉద్యమం చేపట్టిన నేపథ్యంలో కేంద్రం రైతు నేతలతో చర్చలు జరుపుతున్నది. ఇప్పటికే ఈనెలలో 8, 12, 15 తేదీల్లో మూడు సార్లు ముగ్గురు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా, నిత్యానంద్ రాయ్ రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం కాగా.. ఆదివారం చండీగఢ్లో రైతు నేతలతో మరోసారి భేటీయై చర్చలు జరిపారు.
రైతుల ఆందోళన నేపథ్యంలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. హర్యానాలోని ఏడు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని ఈనెల 19 వరకు పొడిగించారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు పంజాబ్లో పటియాలా, సంగ్రూర్, ఫతేగఢ్ సాహిబ్ తదితర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ సేవల రద్దును 24 వరకు పొడిగించారు.
కేంద్ర ప్రభుత్వం కాలయాపన విధానాలు మానుకొని, లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే కంటే ముందే ఎంఎస్పీకి చట్టబద్ధతతో సహా రైతుల ఇతర డిమాండ్లను పరిష్కరించాలని రైతు నేత జగ్జిత్ సింగ్ దల్లేవాల్ డిమాండ్ చేశారు. పంజాబ్-హర్యానా సరిహద్దు శంభు వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో కేంద్రం చర్చలు చేస్తున్నట్టు కనిపించడం లేదని అన్నారు. ఎంఎస్పీకి చట్టబద్ధతకు ఒక ఆర్డినెన్స్, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలుకు ఒక నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా కేంద్రం పరిష్కారం చూపొచ్చని అభిప్రాయపడ్డారు. డిమాండ్లు నెరవేర్చే వరకు రైతులు వెనక్కు వెళ్లేది లేదని స్పష్టం చేశారు.