Water Apple | కెరమెరి, ఫిబ్రవరి 18 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ధనోరా గ్రామానికి చెందిన రైతు కేంద్రే బాలాజీ మరో కొత్త రకమైన పంటకు శ్రీకారం చుట్టాడు. గతంలో యాపిల్ సాగు చేసి రాష్ట్ర ఉత్తమ రైతుగా అప్పటి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అవార్డు అందుకొని ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ప్రస్తుతం వాటర్ యాపిల్ను పరిచయం చేశాడు. 2015లో కేరళ నుంచి నాలుగు వాటర్ యాపిల్ మొక్కల(ఒక్కో మొక్కకు రూ. 120)ను కొనుగోలు చేసి తీసుకొచ్చి నాటాడు. ఎరువులు, క్రిమిసంహారక మందులేవీ వాడలేదు.
నీళ్లు మాత్రమే పెట్టగా ఏపుగా పెరిగాయి. 2022లో పండ్లు కాయలు పడ్డాయి. యేటా ఫిబ్రవరి, ఏప్రిల్లో దిగుబడి వస్తుందని, ఒక్కో చెట్టుకు సుమారు క్వింటాల్ దాకా పండ్లు కాస్తాయని రైతు చెబుతున్నాడు. ఈ యేడాది ప్రస్తుతం పంట చేతికి వస్తున్నది. ఇప్పటి వరకు 50 కిలోల పండ్లు తెంపి, కిలో రూ.60 చొప్పున విక్రయిస్తున్నాడు. ఏమాత్రం శ్రమ.. పెట్టుబడి లేకుండా మంచి ఆదాయం పొందవచ్చని కేంద్రే బాలాజీ చెబుతున్నాడు.
ధనోరాలో యాపిల్ సాగు చేసిన. రాష్ట్ర ఉత్తమ రైతుగా కేసీఆర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న. మళ్లా ఏదైనా కొత్తరకమైన పంట వేయాలనుకున్న. వాటర్ యాపిల్ గురించి తెలుసుకున్న. 2015లో కేరళ వెళ్లి నాలుగు మొక్కలు తెచ్చి నాటిన. ఇక్కడ మొక్కలు పెరుగుతాయో లేవో అనుకున్న. 2022 వరకు పెద్దగైనయ్. కాయలు పడ్డయి. ఇప్పటికే రెండుసార్లు దిగుబడి వచ్చింది. ఇది మూడోసారి. రూపాయి పెట్టుబడి లేకుండా లాభం పొందవచ్చు. మున్ముందు మరిన్ని చెట్లు పెట్టాలనుకుంటున్న. – కేంద్రే బాలాజీ, రైతు ధనోర