IPL 2023 : ఐపీఎల్ పదహారో సీజన్కు ముందు పంజాబ్ కింగ్స్ (Punjab Kings) ఫ్రాంఛైజీకి షాక్. ఆ జట్ట స్టార్ ఓపెనర్ జానీ బెయిర్స్టో (Jonny Bairstow) సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ECB) అతడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దాంతో, అతని ప్లేస్లో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మాథ్యూ షార్ట్(Matthew Short)ను పంజాబ్ తీసుకోనుంది. విక్టోరియా జట్టు ఆల్రౌండర్ అయిన షార్ట్ 2022-23 బిగ్ బాష్ లీగ్లో ఇరగదీశాడు. అడిలైడ్ స్ట్రైకర్స్ ఓపెనర్గా బరిలోకి దిగి 144 స్ట్రైక్ రేటుతో 450 రన్స్ చేశాడు. బంతితోనూ రాణించి 11 వికెట్లు తీశాడు.
గత ఏడాది బెయిర్స్టో కాలు, కాలిమడిమకు సర్జరీ అయింది. అతను ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. దాంతో, అతడికి మరింత విశ్రాంతి అవసరమని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు భావించింది. అందుకని ఎన్ఓసీ ఇవ్వలేదు. బెయిర్స్టోను 2022 మినీ వేలంలో రూ.6.75కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్లో అతను ఫర్వాలేదనిపించాడు. ఈసారి అతడితో పాటు సామ్ కరన్, లివింగ్స్టోన్పై పంజాబ్ భారీ ఆశలు పెట్టుకుంది. ఈ ఏడాది మినీ వేలంలో పంజాబ్ ఆల్రౌండర్ సామ్ కరన్ కోసం రూ. 18.50 కోట్ల ధర పెట్టింది. ఇంగ్లండ్ జట్టు 2022 పొట్టి ప్రపంచ కప్ గెలవడంలో కరన్ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లో మూడు వికెట్లు తీసి పాకిస్థాన్ను దెబ్బకొట్టాడు. టోర్నీ ఆసాంతం అద్బుతంగా రాణించిన అతడు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా ఎంపికయ్యాడు.
మార్చి 31న పదహారో సీజన్ ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఆరంభ పోరులో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈసారి ఐపీఎల్ మరింత స్పెషల్ ఉండనుంది. ప్రతి జట్టు సొంత గ్రౌండ్లో ఏడు మ్యాచ్లు ఆడుతుంది. అంతేకాదు టాస్ గెలిచాక తుది జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఇంప్యాక్ట్ ప్లేయర్ను కూడా తీసుకునేందుకు వీలుంది.