Bhuvneshwar Kumar: ఆరేండ్ల తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా ఏస్ పేసర్ భువనేశ్వర్ కుమార్.. తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. దేశవాళీ క్రికెట్లో భాగంగా జరుగుతున్న రంజీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ తరఫున ఆడుతున్న భువీ.. బెంగాల్ను బెంబేలెత్తించాడు. రీఎంట్రీలో ఏకంగా 8 వికెట్లు (8/41) పడగొట్టి సత్తాచాటాడు. భువీ ధాటికి తొలి ఇన్నింగ్స్లో బెంగాల్.. 58.2 ఓవర్లలో 188 పరుగులకే ఆలౌట్ అయింది. బెంగాల్ టీమ్లో ఫస్ట్ ఫైవ్ వికెట్స్ భువీకే దక్కాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో భువీకి ఇది కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో భువీ అత్యుత్తమ ప్రదర్శన గతంలో 6/77గా నమోదైంది.
2022లో చివరిసారిగా భారత జట్టు తరఫున మ్యాచ్ ఆడిన భువీ ఆ తర్వాత జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ఫామ్ లేమితో పాటు వయసు సమస్య ఒకటి కాగా టీమ్ మేనేజ్మెంట్ యువ బౌలర్లను ప్రోత్సహిస్తుండటంతో భువీకి అవకాశాలు దక్కడం లేదు. టెస్టులలో అయితే భువీ జాతీయ జట్టులో ఆడక ఆరేండ్లు దాటింది. 2018 లో భువీ.. సౌతాఫ్రికాతో ఆఖరి టెస్టు ఆడాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అయితే 2022లో భారత జట్టు సఫారీ టూర్కు వెళ్లగా అక్కడ వన్డే సిరీస్లో ప్రాతినిథ్యం వహించాడు. ఇక టీ20 క్రికెట్లో 2022 నవంబర్లో నేపియర్ వేదికగా న్యూజిలాండ్తో ఆడిన మ్యాచే చివరిది. ఆ తర్వాత భువీ మళ్లీ బ్లూ జెర్సీ ధరించలేదు.
8 wickets for Bhuvneshwar Kumar in Ranji Trophy…..!!!
Bhuvi, playing his first FC game after 6 long years and he has taken 9 wickets for just 41 runs against Bengal in the Ranji Trophy. 🔥 pic.twitter.com/c5huCt9HyJ
— Johns. (@CricCrazyJohns) January 13, 2024
మెన్ ఇన్ బ్లూతో కలవడానికి భువీ ఇటీవల దేశవాళీ క్రికెట్లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొన్నాడు. పలు లిస్ట్ ఏ మ్యాచ్లు కూడా ఆడాడు. కానీ సెలక్టర్లు మాత్రం అతడిని పట్టించుకోలేదు. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ స్వింగ్ మాస్టర్.. తాజాగా రంజీలలో ఇదే ప్రదర్శన కొనసాగిస్తే సెలక్టర్లకు కొత్త తలనొప్పులు సృష్టించడం ఖాయం. భువీ తాజా ప్రదర్శన నేపథ్యంలో అతడికి జాతీయ జట్టులో చోటు కల్పించాలని టీమిండియా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బీసీసీఐని కోరుతున్నారు.