వడోదర: నెల రోజులుగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) చివరి అంకానికి చేరింది. ఆరంభం నుంచి వరుస విజయాలతో అందరికంటే ముందుగా ఫైనల్ బెర్తును ఖాయం చేసుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ను టోర్నీ చరిత్రలో రికార్డు స్థాయిలో వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ ఢీకొననుంది.
ఆర్సీబీ ఇదివరకే 2024లో ఇదే ఢిల్లీని ఓడించి టైటిల్ నెగ్గి ఈ సీజన్లోనూ అదే మ్యాజిక్తో రెండో ట్రోఫీని ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నది. మరోవైపు మూడుసార్లు ఫైనల్ చేరినా రన్నరప్తో సరిపెట్టుకున్న ఢిల్లీ.. కొత్త సారథి జెమీమా రోడ్రిగ్స్ సారథ్యంలో ఈసారైనా ఆ గండాన్ని అధిగమించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నది. మరి బెంగళూరుకు ‘డబుల్’ ఆనందం దక్కుతుందో? లేక క్యాపిటల్స్ కల నెరవేరుతుందో? చూడాలి. నేటి రాత్రి 7 గంటల నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లలో చూడొచ్చు.