India Tour Of South Africa: వన్డే వరల్డ్ కప్ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడుతున్న భారత జట్టు.. ఇది ముగిసిన వెంటనే సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. మూడు ఫార్మాట్లలో మ్యాచ్లు ఆడనున్న భారత్.. తొలుత టీ20లు ఆడాల్సి ఉంది. మొదటగా పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు జట్టును ప్రకటించే అవకాశం ఉంది. అన్నీ కుదిరితే గురువారం (నవంబర్ 30న) టీ20, వన్డేలకు జట్టును ప్రకటించనున్నట్టు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆసీస్తో టీ20 సిరీస్కు సీనియర్ల గైర్హాజరీతో యువ భారత్ అంచనాలకు మించి రాణిస్తుండటంతో సఫారీలతో కూడా ఇదే జట్టును కంటిన్యూ చేసే అవకాశాలున్నాయి. కానీ కెప్టెన్గా మాత్రం సూర్యను కాకుండా రోహిత్ శర్మను తిరిగి ఆడించే అవకాశాలున్నట్టు బీసీసీఐ వర్గాల సమాచారం. ఈ మేరకు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని ఆలిండియా సెలక్షన్ కమిటీ.. రోహిత్తో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తున్నది.
గతేడాది టీ20 ప్రపంచకప్లో భాగంగా సెమీఫైనల్లో ఇంగ్లండ్తో ఘోరపరాజయం తర్వాత రోహిత్ తో పాటు విరాట్ కోహ్లీ, అశ్విన్, షమీ వంటి సీనియర్లు మళ్లీ అంతర్జాతీయ స్థాయిలో టీ20లు ఆడలేదు. రోహిత్ గైర్హాజరీలో హార్ధిక్ పాండ్యా జట్టును నడిపిస్తుండగా తాజాగా ఆసీస్తో సిరీస్కు ముందు అతడు గాయంతో వైదొలగడంతో బీసీసీఐ సూర్యకు సారథ్య పగ్గాలు అప్పజెప్పింది. అయితే సఫారీ సిరీస్లో మాత్రం సూర్యను కాకుండా రోహిత్ సారథ్యంలోనే ఆడాలని బీసీసీఐ భావిస్తోంది. కానీ ఏడాది కాలంగా టీ20లకు దూరంగా ఉన్న రోహిత్.. మళ్లీ వాటిని ఆడేందుకు ఆసక్తి చూపుతాడా..? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ టూర్లో భాగంగా టీ20, వన్డేలకు తాను దూరంగా ఉంటానని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇదివరకే బీసీసీఐకి తెలిపిన విషయం తెలిసిందే.
Team India for South Africa tour is likely to be announced on tommorow. (Dainik Jagran) pic.twitter.com/TM7fKUbwMj
— CricketMAN2 (@ImTanujSingh) November 29, 2023