ఇంగ్లండ్ సిరీస్ కోసం యూకే వెళ్లిన టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు వార్నింగ్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. వీళ్లిద్దరూ నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ కోసం లీసెస్టర్షైర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా బయటకు వెళ్లిన వాళ్లు అక్కడ కనిపించిన అభిమానులతో ఫొటోలకు ఫోజిచ్చారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ కూడా అయ్యాయి.
ఈ విషయాన్ని బీసీసీఐ సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే స్టార్ స్పిన్నర్ అశ్విన్ కరోనా కారణంగా క్వారంటైన్లోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో మిగతా ఆటగాళ్లకు కూడా కరోనా సోకితే మరోసారి సిరీస్ ప్రమాదంలో పడుతుందని బీసీసీఐ ఆందోళన చెందుతోంది.
ఈ కారణంగానే మాస్కులు లేకుండా బయటకు వెళ్లడం, అభిమానులను కలవడం వంటి విషయాలపై టీమిండియా ఆటగాళ్లకు వార్నింగ్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ‘‘యూకేలో కరోనా ప్రమాదం తగ్గింది. కానీ ఆటగాళ్లు జాగ్రత్తగా ఉండాలి కదా. కొన్ని జాగ్రత్తలు పాటించాలని వాళ్లకె చెప్తాం’’ అని బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ తెలిపారు.
యూకేలో ఇంకా కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గలేదు. ఇప్పటికీ ప్రతిరోజూ 10 వేలపైగా కరోనా కేసులు నమోదవుతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్లు జాగ్రత్తలు పాటించాలని బీసీసీఐ భావిస్తోంది.
Rohit Sharma and Virat Kohli with fans at UK. pic.twitter.com/IMqLRdqVsM
— Johns. (@CricCrazyJohns) June 20, 2022