TeamIndia New Jersey : టెస్టు క్రికెట్కు కొత్త కళ తెచ్చిన ప్రపంచటెస్టు చాంపియన్షిప్(WTC 2023) మరో వారంలో మెదలుకానుంది. ఓవల్ స్టేడియం వేదికగా టెస్టు గద కోసం ఆస్ట్రేలియాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే ఇంగ్లండ్ చేరకున్న భారత ఆటగాళ్లు నెట్స్లో తీవ్రంగా సాధన చేస్తున్నారు. ఈసారి భారత జట్టు కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. మూడు ఫార్మాట్లకు కొత్త జెర్సీలను బీసీసీఐ(BCCI) ఈరోజు సాయంత్రం విడుదల చేసింది.
ఈమధ్యే కిట్ స్పాన్సర్గా ఎంపికైన ప్రముఖ స్పోర్ట్స్ కంపెనీ అడిడాస్ లోగో జెర్సీ మీద ఉండనుంది. వన్డే, టీ20 జెర్సీలను కొంచెం భిన్నంగా రూపొందించారు. పురుషుల జట్టుతో పాటు మహిళల టీమ్, భారత ఏ జట్లకు, అండర్ – 19 టీమ్లకు కూడా అడిడాస్ కిట్ స్పాన్సర్గా వ్యవహరించనుంది. 2028 మర్చి వరకు ఈ కంపెనీ టీమిండియా కిట్ స్పాన్సర్గా కొనసాగనుంది.
వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన భారత్ టెస్టు గదపై గురి పెట్టింది. ఇంగ్లండ్లోని ఓవల్ స్టేడియం వేదికగా జూన్ 7 -11 తేదీల్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య టెస్టు చాంపియన్షిప్ జరగనుంది. 2021లో ఫైనల్ చేరిన భారత్ ఆఖరి మెట్టుపై భంగపడింది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా న్యూజిలాండ్ చేతిలో అనూహ్యంగా ఓటమి పాలైంది. దాంతో, టీమిండియా ఈసారి కప్పు కొట్టాలనే కసితో ఉంది. తొలిసారి ఫైనల్ చేరిన ఆసీస్ కూడా విజయంపై కన్నేసింది. స్వదేశంలో జరిగిన బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో 4-2తో కంగారులను చిత్తు చేసిన రోహిత్ సేన అదే ఫలితాన్ని పునరావృతం చేస్తుందా? లేదా? అనేది మరో వారం రోజుల్లో తేలిపోనుంది.