India-Pakistan | దాయాదులు.. భారత్- పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఇరు దేశాల్లో ప్రత్యేకించి భారత్లో ఎంతో ఆసక్తి.. నరాలు తెగే ఉత్కంఠ. ప్రస్తుతం ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ -2023కి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ నెల 14న అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ తల పడనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ను తిలకించడానికి వచ్చే వారితో టికెట్లకు ఫుల్ గిరాకీ నెలకొంది. దీంతో అహ్మదాబాద్.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం బీసీసీఐ 14 వేల టికెట్లు రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తున్నది. 2016లో టీ-20 వరల్డ్ కప్ తర్వాత భారత్లో ఇరు జట్లు పోటీ పడటం ఇదే తొలిసారి. నాటి మ్యాచ్లో టీం ఇండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే.
‘అక్టోబర్ 14న అహ్మదాబాద్లో జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం 14 వేల టికెట్లు విడుదల చేయాలని నిర్ణయించాం’ అని బీసీసీఐ శనివారం పొద్దుపోయిన తర్వాత ఓ ప్రకటనలో తెలిపింది. ‘ఆదివారం (అక్టోబర్ 8) నుంచి టికెట్ల విక్రయం ప్రారంభం అవుతుంది. క్రికెట్ అభిమానులు అధికారిక టికెటింగ్ వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేయొచ్చు’ అని కూడా పేర్కొంది.
అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియంలో 1.30 లక్షల మందికి పైగా కూర్చునే వెసులుబాటు ఉంది. గత గురువారం జరిగిన ప్రారంభ మ్యాచ్కు 47 వేల మంది వీక్షకులు హాజరయ్యారు. న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య గురువారం మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.