BCCI : రంజీల్లో ఆడేందుకు ఒడిశా క్రికెటర్ సుమిత్ శర్మ(Sumit Sharma) తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించాడు. తన వయసును తక్కువ చూపడం కోసం రెండు, మూడు బర్త్ సర్టిఫికెట్లు పంపాడు. చివరకు అతడి మోసాన్ని బీసీసీఐ(BCCI) పసిగట్టింది. తప్పుడు సర్టిఫికెట్లతో రంజీల్లో ఆడాలనుకున్ అతడికి పెద్ద షాకిస్తూ… రెండేండ్ల నిషేధం విధించింది. వచ్చే రెండేండ్లు దేశవాళీ క్రికెట్లో ఆడకూడదని తేల్చి చెప్పింది. దాంతో అతడు ఒడిశా బృందం నుంచి వైదొలగనున్నాడు. సుమిత్ స్థానంలో తరిని సా(Tarini Sa) జట్టుతో కలువనున్నాడు.
అసలేం జరిగిందంటే.. రంజీ సీజన్ 2024 కోసం సుమిత్ సమర్పించిన బర్త్ సర్టిఫికెట్లకు 2015-16 సీజన్లో అందజేసిన పత్రాలకు పొంతనే లేదు. దాంతో, అతడి వయసుపై పలువురు ఆనుమానాలు లేవనెత్తారు. అప్పటికే ఒడిశా క్రికెట్ ఆసోసియేషన్(OCA) సుమిత్ పేరును స్క్వాడ్లో చేర్చింది. కానీ, తీరా టోర్నీ మొదలయ్యేసరికి సుమిత్ అంశం మళ్లీ తెరపైకి రావడంతో బీసీసీఐ అతడు చేసిన మోసాన్ని గుర్తించింది.
‘ఒడిశా సీనియర్ జట్టుకు చెందిన సుమిత్ శర్మను బీసీసీఐ సస్పెండ్ చేసింది. రెండేండ్ల పాటు దేశవాళీ క్రికెట్ ఆడకుండా అతడిపై నిషేధం విధించింది. అతడి స్థానంలో తరినిని ఎంపిక చేశాం’ అని ఒడిశా సెక్రటరీ సంజయ్ బెహెరా మీడియా సమావేశంలో తెలిపాడు.