Rajendranagar PS | దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్గా రాజేంద్రనగర్ పీఎస్ నిలిచింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2023 సంవత్సరానికి గానూ దేశంలోని అత్యుత్తమ పోలీస్ స్టేషన్ల జాబితాను శుక్రవారం ప్రకటించింది. ఇందులో రాష్ట్రంలోని రాజేంద్రనగర్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా జైపూర్లో జరిగిన డీజీపీల సదస్సులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నుంచి రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ బి.నాగేంద్రబాబు ట్రోఫీ అందుకున్నారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ నాగేంద్రబాబును డీజీపీ రవి గుప్తా అభినందించారు.
2023వ సంవత్సరంలో దేశంలో ఉన్న దాదాపు 17 వేలకు పైగా పోలీస్ స్టేషన్ల పనితీరు ఆధారంగా వివిధ ప్రామాణికాలను పరిశీలించి.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ బహుమతులను ప్రకటించింది. పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ రకాల కేసుల దర్యాప్తు జరిగిన తీరు, పోలీస్ స్టేషన్ భవన నిర్వహణ తదితర అంశాల ఆధారంగా ఈ ఎంపిక జరుగుతుంది. మహిళలపై కేసుల దర్యాప్తు, ట్రాఫిక్ నియంత్రణ, రోడ్ సేఫ్టీ వంటి పలు అంశాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు పరిశీలించి ఈ బహుమతులను ప్రకటిస్తారు. సీసీటీఎన్ఎస్ ద్వారా రెండో దశలో 75 పోలీస్ స్టేషన్లను షార్ట్ లిస్ట్ చేసి చివరకు దేశంలోనే రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ను అత్యుత్తమ పోలీస్ స్టేషన్గా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ జాబితాలో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ ప్రథమ బహుమతి గెలుచుకోగా.. కశ్మీర్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి.