Day-Night Test | డే నైట్ టెస్టులపై భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆసక్తి చూపించడం లేదు. ఈ క్రమంలో సీజన్లో భారత దేశవాళీ సీజన్ పురుషుల, మహిళల క్రికెట్ జట్లకు పింక్ బాల్ టెస్ట్ మ్యాచులను షెడ్యూల్ చేయలేదు. అయితే, పింక్ బాల్ మ్యాచుల నిర్వహించకపోవడంపై బీసీసీఐ సెక్రెటరీ జై షా కారణాలు వెల్లడించారు. డే నైట్ టెస్టు మ్యాచ్లు మూడురోజులకు మించి జరుగడం లేదని.. వాటిపై అభిమానులు ఆసక్తి చూపడం లేదన్నారు. పింక్ బాల్ టెస్ట్ని అభిమానులు చూడాలంటే.. ఆసక్తిని పెంచాలన్నారు.
మ్యాచులు నాలుగైదు రోజులు చూడాలని అభిమానులు కోరుకుంటారని.. ప్రస్తుతం రెండు, మూడురోజుల్లోనే ముగుస్తున్నాయన్నారు. అభిమానులు అలవాటుపడిన తర్వాత తాము డే నైట్ టెస్టులు నిర్వహిస్తామన్నారు. ఇదిలా ఉండగా.. పింక్ బాల్తో భారత్ ఇప్పటి వరకు నాలుగు టెస్టులు ఆడింది. ఇందులో మూడింటిలో గెలిచిన జట్టు.. ఒక్క మ్యాచ్లో పరాజయం పాలైంది. బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, శ్రీలంకలతో డే-నైట్ టెస్టులు ఆడింది. బంగ్లాదేశ్పై భారత్ ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఆస్ట్రేలియాపై భారత జట్టు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అడిలైడ్లో జరిగిన ఆ మ్యాచ్లో టీమిండియా కేవలం 36 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాండ్పై 10 వికెట్ల తేడాతో, శ్రీలంకపై 238 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ మినహా మిగిలిన మూడు డే-నైట్ టెస్టులను భారత్ తన సొంత గడ్డపై ఆడింది. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన చివరి టెస్టులో పింక్ బాల్తో ఆడిన భారత్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసిపోయింది. భారత మహిళల జట్టు ఏకైక డే-నైట్ టెస్ట్ ఆస్ట్రేలియాలో జరగ్గా.. 2021లో ఆడిన ఈ టెస్ట్ డ్రాగా ముగిసింది.