న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐఎస్ఎల్) అభిమానులకు మరింత కిక్ ఇచ్చేందుకు త్వరలో సర్వహంగులతో రాబోతున్నది. రెండు జట్ల చేరికతో కొత్త రూపు సంతరించుకోబోతున్న ఐపీఎల్ మార్చి ఆఖరి వారంలో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గి, పరిస్థితులు అదుపులోకి వస్తే మార్చి 27 నుంచి ఐపీఎల్ 15వ సీజన్ను మనం పూర్తి స్థాయిలో ఆస్వాదించవచ్చు. లీగ్ నిర్వహణకు తోడు వేదికలు, బయోబబుల్, ప్రత్యామ్నాయ వేదికలు లాంటి కీలక అంశాలపై శనివారం జరిగిన బీసీసీఐ వర్చువల్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా గత సీజన్లలా కాకుండా ఈసారి స్వదేశంలోనే లీగ్ నిర్వహించాలని మెజారిటీ ఫ్రాంచైజీలు కోరినట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నాడు.
ముంబై, పుణెలో మ్యాచ్లు!
మెజారిటీ ఫ్రాంచైజీలు భారత్లోనే ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించాలని కోరుతున్న నేపథ్యంలో వేదికలపై సమావేశంలో చర్చ జరిగింది. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని గత సీజన్ లాగా కాకుండా పరిమిత వేదికలపై మ్యాచ్లు నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో ముంబై, పుణెలో మ్యాచ్లు జరిగే అవకాశముంది. ముంబైలో మూడు స్టేడియాలు(వాంఖడే, బ్రబౌర్న్, డీవై పాటిల్), పుణెలో ఎంసీఏ స్టేడియాలు ఉన్నాయి. దీంతో బయోబబుల్ ఏర్పాటు చేయడం సులువు అవుతుంది. మార్చి 27న లీగ్ మొదలయ్యేలా ఉంది. అదే సమయంలో ఏప్రిల్ 2వ తేదీని కూడా బోర్డు సభ్యులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ‘తేదీల విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. కొంత మంది ఫ్రాంచైజీ యజమానులు మార్చి 27కు మొగ్గుచూపారు. కానీ శ్రీలంకతో భారత్ ఆఖరి టీ20 మ్యాచ్ మార్చి 18న ముగుస్తుంది. జస్టిస్ లోధా సిఫారసుల ప్రకారం భారత మ్యాచ్కు లీగ్ ప్రారంభానికి మధ్య రెండు వారాల సమయం ఉండాలి. అలా అయితే ఏప్రిల్ 2న మొదలవవచ్చు’ అని బోర్డు వర్గాలు తెలిపాయి.
యూఏఈ, దక్షిణాఫ్రికా..ప్రత్యామ్నాయం
భారత్లోనే లీగ్ను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న బీసీసీఐ..ప్రత్యామ్నాయ వేదికలపై కూడా దృష్టి సారించింది. మార్చి ఆఖరి నాటికి దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడితే గత సీజన్లా విభిన్న వేదికల్లో కాకుండా పరిమిత స్టేడియాల్లో మ్యాచ్లను నిర్వహించాలన్న ఆలోచనతో బోర్డు కనిపిస్తున్నది. ఒకవేళ అప్పటికీ పరిస్థితులు అదుపులోకి రాకపోతే గత రెండు సీజన్లకు ఆతిథ్యమిచ్చిన యూఏఈ వైపు బోర్డు మొగ్గుచూపవచ్చు. అలా కాదనుకుంటే 2009లో లీగ్ జరిగిన దక్షిణాఫ్రికా కూడా తమ పరిశీలనలో ఉన్నట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. శ్రీలంకలో ఐపీఎల్ నిర్వహణపై ఎలాంటి చర్చ జరుగలేదని తెలిసింది.
స్టోక్స్, గేల్ ఔట్
ఈ సీజన్కు టీ20 స్టార్లు క్రిస్ గేల్, బెన్ స్టోక్స్, ఆర్చర్, సామ్ కరన్, మిచెల్ స్టార్క్ దూరమయ్యారు. పొట్టి ఫార్మాట్లో మెరుపులు మెరిపించిన వీరంతా ఐపీఎల్ నుంచి తప్పుకున్నారు.
శ్రేయాస్, వార్నర్కు గిరాకీ
ఈసారి ఐపీఎల్లో మొత్తం 1214 మంది ప్లేయర్లు వేలంలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకున్నారు. భారత్తో పాటు 18 దేశాల నుంచి ఆటగాళ్లు ఆసక్తి కనబరిచారు. ఇందులో 896 మంది భారత క్రికెటర్లు, 318 మంది విదేశీయులు ఉన్నారు. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరిగే ఐపీఎల్ మెగా వేలం లో శ్రేయాస్ అయ్యర్, వార్నర్, చాహల్, అశ్విన్, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్ భారీ ధర పలికే అవకాశముంది. వీరంతా రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి రానున్నారు. టీ20 ప్రపంచకప్లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచిన వార్నర్ కోసం ఫ్రాంచైజీలు పోటీపడే చాన్స్ కనిసిస్తున్నది.
ఆస్ట్రేలియా 59, భూటాన్ 1
ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా నుంచి అత్యధికంగా 59 మంది ప్లేయర్లు ఆసక్తి కనబరిస్తే..భూటాన్ నుంచి ఒకరు ఉన్నారు. మిగతా దేశాల విషయానికొస్తే..దక్షిణాఫ్రికా (48 మంది), వెస్టిండీస్ (41), శ్రీలంక (36), ఇంగ్లండ్ (30), న్యూజిలాండ్ (29),అఫ్గనిస్థాన్ (20), నేపాల్ (15), అమెరికా (14) ఉన్నారు.