WTC 2023 : ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్( WTC 2023)కు ప్రకటించిన జట్టులో బీసీసీఐ మార్పులు చేసింది. గాయం కారణంగా కేఎల్ రాహుల్(KL Rahul) ఈ మెగా టోర్నీకి దూరం కావడంతో టీమిండియా స్క్వాడ్ను సవరిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జై షా(Jai Shah) ఒక ప్రకటన విడుదుల చేశాడు. రాహుల్ ప్లేస్లో యంగ్ ఓపెనర్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్(Ishan Kishan)కు చోటు దక్కింది.
పదహారో సీజన్ ఐపీఎల్లో అదరగొడుతున్న సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్, ముఖేశ్ కుమార్లను స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపికయ్యారు. గాయపడిన పేసర్ జయదేవ్ ఉనాద్కాట్ స్థానంపై ప్రస్తుతానికైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
NEWS – KL Rahul ruled out of WTC final against Australia.
Ishan Kishan named as his replacement in the squad.
Standby players: Ruturaj Gaikwad, Mukesh Kumar, Suryakumar Yadav.
More details here – https://t.co/D79TDN1p7H #TeamIndia
— BCCI (@BCCI) May 8, 2023
స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్ సిరీస్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్ డబ్ల్యూటీసి తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే.. లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. నొప్పితో విలవిలలాడుతూ మైదానం వీడాడు. స్కానింగ్ చేశాక అతను సీజన్ మొత్తానికి, ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు దూరమయ్యాడని బీసీసీఐ తెలిపింది. దాంతో, అతడి స్థానంలో ఇషాన్ కిషన్ ఎంపికయ్యాడు. విధ్వంసక బ్యాటింగ్ చేసే ఇషాన్ రాకతో భారత జట్టు మరింత బలంగా మారనుంది. అంతేకాదు పదహారో సీజన్ ఐపీఎల్లో రఫ్ఫాడిస్తున్న అజింక్యా రహానే మిడిలార్డర్లో కీలకం కానున్నాడు. స్టాండ్ బైగా ఎంపికైన సూర్య, రుతురాజ్, ముకేశ్ కుమార్ అవకాశం వస్తే సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు.
భారత బృందం ఇదే : రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, ఛటేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్ధూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనాద్కాట్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్).
స్టాండ్ బై ప్లేయర్స్ : సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్, ముఖేశ్ కుమార్
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్( డబ్యూటీసీ 2023) రెండోసారి కూడా ఇంగ్లండ్ గడ్డపైనే జరగనుంది. ఓవల్ స్టేడియం వేదికగా జూన్ 7 నుంచి 11వ తేదీ వరకు జరగనుంది. ఆస్ట్రేలియా, భారత్ జట్లు టైటిల్ పోరులో తలపడనున్నాయి. 2021-22లో రన్నరప్తో సరిపెట్టుకున్న టీమిండియా ఈసారి టెస్టు గదను సాధించాలనే పట్టుదలతో ఉంది. ఎందుకంటే..? కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, పూజారా, షమీ, జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్ ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నారు. అంతేకాదు సొంత గడ్డపై బోర్డర్ – గావస్కర్ ట్రోఫీలో 2-0తో భారత్, ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. దాంతో, ఫైనల్లోనూ రోహిత్ సేన ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది.