Bangladesh Cricket: బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు కొత్త సారథి వచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్లో అనుసరిస్తున్న ఫార్ములాకు పూర్తి భిన్నంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) మూడు ఫార్మాట్లకూ ఒక్కడే కెప్టెన్ను నియమించింది. బంగ్లా జట్టులో స్టార్ బ్యాటర్గా ఉన్న నజ్ముల్ హోసెన్ శాంటోను టెస్టులతో పాటు వన్డే, టీ20 లకు సారథిని చేసింది. ఇటీవల న్యూజిలాండ్ టూర్లో శాంటో.. షకిబ్ అల్ హసన్ గైర్హాజరీలో జట్టును నడిపించాడు. వన్డే వరల్డ్ కప్లో షకిబ్ సారథ్యంలోనే ఆడినా ఆ తర్వాత అతడు ఎంపీగా గెలవడం, కన్నుకు గాయం కావడంతో కొన్నాళ్లు క్రికెట్కు దూరంగా ఉంటానని చెప్పడంతో బీసీబీ కొత్త సారథిని నియమించింది. శాంటో ఏడాదిపాటు మూడు ఫార్మాట్లకూ కెప్టెన్గా ఉంటాడని బీసీబీ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది.
2017లో జాతీయ జట్టులోకి వచ్చిన శాంటో.. ఇప్పటివరకూ 25 టెస్టులు, 42 వన్డేలు, 28 టీ20లు ఆడాడు. టెస్టులలో 1,449 పరుగులు చేసిన శాంటో.. వన్డేలలో 1,202 పరుగులు, టీ20లలో 602 రన్స్ చేశాడు. కెప్టెన్గా శాంటోకు తొలి పరీక్ష వచ్చే నెల ఎదురుకానుంది. మార్చిలో బంగ్లాదేశ్ జట్టు.. శ్రీలంక పర్యటనలో భాగంగా మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులను ఆడాల్సి ఉంది.
Set to lead his country in all three formats 🇧🇩
More as Najmul Hossain Shanto takes on captaincy reins 👇https://t.co/XN275iTMcO
— ICC (@ICC) February 13, 2024
కొత్త చీఫ్ సెలక్టర్..
కెప్టెన్తో పాటు బంగ్లా జట్టుకు కొత్త చీఫ్ సెలక్టర్ కూడా వచ్చాడు. ఘాజీ అష్రఫ్ హోసెన్ను బీసీబీ జాతీయ సీనియర్ జట్టుకు చీఫ్ సెలక్టర్గా నియమించింది. హన్నన్ సర్కార్ కొత్త సెలక్టర్గా ఎంపికయ్యాడు. గతంలో చీఫ్ సెలక్టర్గా ఎనిమిదేండ్లపాటు మినహజుల్ అబేదిన్ ఉండగా సెలక్టర్గా హబీబుల్ బాషర్లు సేవలందించారు.