న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ క్యాబినెట్లో కొత్తగా చోటు దక్కిన వారిలో ఏడుగురు మహిళలు ఉన్నారు. ప్రముఖ న్యాయవాది, ఢిల్లీ ఎంపీ మీనాక్షి లేఖికి కేంద్ర మంత్రివర్గంలో స్ధానం లభించింది. మీనాక్షి లేఖి బీజేపీ జాతీయ ప్రతినిధిగానూ పనిచేశారు. పలు సామాజిక సంస్ధల్లో ఆమె చురుకైన పాత్ర పోషించారు. ఇక యూపీలోని మిర్జాపూర్లో అప్నాదళ్ ఎంపీగా ఎన్నికైన అనుప్రియా సింగ్ పటేల్ కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు.
అనుప్రియ ఢిల్లీలోని లేడీ శ్రీరాం కాలేజ్లో అభ్యసించారు. ఈమె తండ్రి సో్నేలాల్ పటేల్ అప్నా దళ్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. కర్నాటకకు చెందిన బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజెకు కేంద్ర మంత్రివర్గంలో స్ధానం లభించింది. ఓపెన్ యూనివర్సిటీలో ఈమె సోషల్ వర్క్లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. గుజరాత్లోని సూరత్ ఎంపీ దర్శన విక్రమ్ జర్దోష్కు మోదీ క్యాబినెట్లో చోటు దక్కింది. 2019 నుంచి దర్శన ఆర్ధిక వ్యవహారాల స్టాండింగ్ కమిటీలో సభ్యురాలుగా ఉన్నారు. విదేశాంగ శాఖ సంప్రదింపుల కమిటీలోనూ సభ్యురాలైన ఆమె బీజేపీ ఉపాధ్యక్షురాలిగా సేవలందించారు.
ఇక జార్ఖండ్కు చెందిన కొడెర్మా ఎంపీ అన్నపూర్ణ దేవికి కేంద్ర మంత్రివర్గంలో పనిచేసే అరుదైన అవకాశం లభించింది. మహిళా సాధికారత కమిటీ, విద్యుత్ సంప్రదింపుల కమిటీలో సభ్యురాలిగా ఆమె వ్యవహరించారు. 1998-2000లో ఆమె బిహార్ ఎమ్మెల్యేగానూ సేవలందించారు. త్రిపుర (తూర్పు)నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతిమా భూమిక్కూ కేంద్ర కేబినెట్లో చోటు దక్కింది. రాజకీయాల్లోకి రాకముందు సేద్యాన్ని నమ్ముకున్న ఆమె ప్రస్తుతం రైల్వే సంపద్రింపుల కమిటీ సభ్యురాలిగా ఉన్నారు.
మహారాష్ట్రలోని దిండోరి ఎంపీ భారతీ ప్రవీణ్ పవార్కూ మంత్రి పదవి లభించింది. నైపుణ్యాభివృద్ధి సంప్రదింపుల కమిటీ సభ్యురాలిగా ఆమె సేవలందిస్తున్నారు. మోదీ క్యాబినెట్లో ఇప్పటికే సీనియర్ బీజేపీ నేతలు నిర్మలా సీతారామన్ ఆర్ధిక మంత్రిగా, స్మృతి ఇరానీ మహిళా శిశుసంక్షేమ శాఖా మంత్రులుగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే.