అవకాశాన్ని టీమ్ఇండియా చేజార్చుకుంది!బ్యాటింగ్కు స్వర్గధామమైన పిచ్పై ఆసీస్ దంచికొడితే.. భారత బ్యాటర్లు లక్ష్యానికి దూరంగా ఉండిపోయారు!
మొత్తానికి వన్డే ప్రపంచకప్ ముందు ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ నెగ్గిన రోహిత్ సేన ఈ సమరోత్సాహంతో.. కదనరంగంలోకి దూకనుంది. రేపటి నుంచే వరల్డ్కప్ వార్మప్ మ్యాచ్లు ప్రారంభం కానుండగా.. మెగాటోర్నీలో భాగంగా వచ్చే నెల 8న చెన్నై వేదికగా టీమ్ఇండియా తమ తొలి పోరులో ఆస్ట్రేలియాతోనే అమీతుమీ తేల్చుకోనుంది.
రాజ్కోట్: పరుగుల వరద పారిన మూడో వన్డేలో ఆస్ట్రేలియాదే పైచేయి అయింది. మూడు మ్యాచ్ల సిరీస్లో తొలి రెండు వన్డేలు నెగ్గి సిరీస్ కైవసం చేసుకున్న టీమ్ఇండియా.. బుధవారం జరిగిన నామమాత్ర మూడో పోరులో 66 పరుగుల తేడాతో ఆసీస్ చేతిలో ఓడింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. మిషెల్ మార్ష్ (84 బంతుల్లో 96; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. స్టీవ్ స్మిత్ (74; 8 ఫోర్లు, ఒక సిక్సర్), మార్నస్ లబుషేన్ (72; 9 ఫోర్లు), డేవిడ్ వార్నర్ (34 బంతుల్లో 56; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 3, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో టీమ్ఇండియా 49.4 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ శర్మ (57 బంతుల్లో 81; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (56; 5 ఫోర్లు, 1 సిక్సర్) రాణించినా ఫలితం లేకపోయింది. ఓపెనర్గా బరిలోకి దిగిన వాషింగ్టన్ సుందర్ (18)తో పాటు కేఎల్ రాహుల్ (26), సూర్యకుమార్ యాదవ్ (8) పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. గత మ్యాచ్ సెంచరీ హీరో శ్రేయస్ అయ్యర్ (48) పర్వాలేదనిపించాడు. ఆసీస్ బౌలర్లలో గ్లెన్ మ్యాక్స్వెల్ 4, హజిల్వుడ్ రెండు వికెట్లు పడగొట్టారు. మ్యాక్స్వెల్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, శుభ్మన్ గిల్కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.
వాళ్లిద్దరూ ఉన్నంతసేపు మనదే..
కొండంత లక్ష్యం కండ్ల ముందు కనిపిస్తున్నా.. భారత జట్టు ఏమాత్రం అదరక బెదరక ఎదురు నిలిచింది. రెగ్యులర్ ఆటగాళ్లు శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా లేకుండానే బరిలోకి దిగిన టీమ్ఇండియా.. స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కు ఓపెనర్గా ప్రమోషన్ ఇచ్చింది. లెఫ్ట్, రైట్ హ్యాండ్ కాంబినేషన్ కలిసొస్తుందని టీమ్ మేనేజ్మెంట్ భావించినా.. అది పెద్దగా కలిసి రాలేదు. చక్కటి అవకాశాన్ని సుందర్ వినియోగించుకోలేకపోయాడు. వేగంగా పరుగులు చేయాల్సిన చోట నింపాదిగా ఆడాడు. అయితే మరో ఎండ్లో రోహిత్ దంచుతుండటంతో అది పెద్ద ప్రభావం చూపలేదు. బౌలర్తో సంబంధం లేకుండా.. హిట్మ్యాన్ బౌండ్రీల మోత మోగించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. తొలి వికెట్కు 74 పరుగులు జోడించిన అనంతరం సుందర్ ఔట్ కాగా.. ఈ క్రమంలో రోహిత్ 31 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కింగ్ కోహ్లీతో కలిసి హిట్మ్యాన్ ఇన్నింగ్స్ నడిపించాడు. ఈ జోడీ సాధికారికంగా బ్యాటింగ్ చేయడంతో లక్ష్యఛేదన పెద్ద కష్టం కాదనిపించింది. ఒక దశలో 20 ఓవర్లలోనే భారత్ ఒక వికెట్ నష్టానికి 140 పరుగులు దాటింది. దీంతో ఇక గెలుపు దరిచేరినట్లే అనుకుంటే.. రోహిత్ ఓ మిస్ షాట్తో మ్యాక్స్వెల్కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాసేపటికి అర్ధశతకం పూర్తి చేసుకున్న అనంతరం కోహ్లీ ఔట్ కాగా.. రాహుల్, సూర్యకుమార్ వెంట వెంటనే పెవిలియన్ చేరారు. దీంతో టీమ్ఇండియా ఆశలు ఆవిరయ్యాయి. చివర్లో రవింద్ర జడేజా (35) పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమైంది.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా: 352/7 (మార్ష్ 96, స్మిత్ 74; బుమ్రా 3/81, కుల్దీప్ 2/48),
భారత్: 49.4 ఓవర్లలో 286 ఆలౌట్ (రోహిత్ 81, కోహ్లీ 56; మ్యాక్స్వెల్ 4/40, హజిల్వుడ్ 2/42).