ArrestKohli | బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతిచెందడం యావత్ జాతిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దుర్ఘటనపై నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ తొక్కిసలాట ఘటన ఆర్సీబీ మెడకు చుట్టుకుంటోంది. ఇప్పటికే ఈ ఘటనపై ఆర్సీబీ, కర్ణాకట క్రికెట్ సంఘం, ఈవెంట్ మేనేజర్లపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ఆర్సీబీ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. తొక్కిసలాటకు భాద్యుడిగా కోహ్లీని అరెస్ట్ చేయాలని సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు #ArrestKohliని నెటిజన్లు విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు.
పుష్ప-2 స్క్రీనింగ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. థియేటర్కు టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ రావడంతోనే తొక్కిసలాట జరిగిందని, పోలీసులు వద్దని వారించినా ఆయన కారులో పరేడ్ నిర్వహించారని ఆరోపిస్తూ ఆ హీరోను అరెస్ట్ చేశారు. ఇప్పుడు కోహ్లీని చూడటానికే లక్షలాది మంది చిన్నస్వామి స్టేడియానికి వచ్చారని, ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందారని అల్లు అర్జున్ అభిమానులు అంటున్నారు. మరి, తమ హీరోను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసినట్టే, ఇప్పుడు కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కోహ్లీని కూడా అరెస్ట్ చేస్తుందా..? అని కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో #ArrestKohli ట్రెండింగ్లో కొనసాగుతోంది.
Also Read..
Nikhil Sosale: ఎవరీ నిఖిల్ సోసేల్?..ఆర్సీబీతో అతనికి లింకేంటి?
Bangalore Stampede | బెంగళూరు తొక్కిసలాట ఘటన.. సిటీ కమిషనర్, నలుగురు పోలీసు అధికారులపై వేటు