IND vs ENG 2nd Test : వైజాగ్ టెస్టులో భారత్, ఇంగ్లండ్లను విజయం ఊరిస్తోంది. టీమిండియాకు 9 వికెట్లు అవసరమవ్వగా.. బెన్ స్టోక్స్ బృందం మరో 332 రన్స్ కొడితే చాలు 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్తోంది. అయితే.. రెండో ఇన్నింగ్స్లో భారత గడ్డపై అంత పెద్ద లక్ష్యాన్ని ఛేదించడం అంత సులువు కాదని రికార్డులు చెప్తున్నాయి. కానీ, ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్(James Anderson) మాత్రం అదేం లేదని, తమ జట్టు గెలవడం పక్కా అని అన్నాడు.
మూడో రోజు మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఈ వెటరన్ పేసర్.. రెండో ఇన్నింగ్స్లో ఆరొందలైనా ఛేదించేందుకు సిద్ధంగా ఉండాలని కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్(Brendon Mccullum) జట్టుతో అన్నాడని తెలిపాడు.
జేమ్స్ అండర్సన్
‘ఈరోజు మేము మా వ్యూహాల్ని పక్కాగా అమలు చేశాం. గిల్, అక్షర్ పటేల్ కీలక భాగస్వామ్యం నెలకొల్పినా.. మా స్నిన్నర్లు మ్యాచ్ను మలుపు తిప్పారు. మేము పటిష్ట స్థితిలో ఉన్నాం. భారత జట్టు 600ల లక్ష్యాన్ని నిర్దేశించినా సరే.. ఛేదించేందుకు సిద్దంగా ఉండాలని కోచ్ మాతో చెప్పాడు’ అని అండర్సన్ వెల్లడించాడు.
What an opportunity ahead.
Fourth innings. 332 more to win.
And you know we’re going for it 💪
🇮🇳 #INDvENG 🏴 | #EnglandCricket pic.twitter.com/Twij9vY7rW
— England Cricket (@englandcricket) February 4, 2024
ఉప్పల్ టెస్టులో విఫలమైన శుభ్మన్ గిల్(104) సెంచరీ బాదడంతో భారత్ భారీ స్కోర్ దిశగా పయనించింది. అయితే.. షోయబ్ బషీర్ సూపర్ బంతితో గిల్ను ఔట్ చేయగా.. ఆ తర్వాత టామ్ హర్ట్లే నాలుగు వికెట్లతో ఇండియాను దెబ్బకొట్టాడు. దాంతో, ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో భారత్ను 255 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం 399 పరుగుల ఛేదనకు దిగిన స్టోక్స్ సేన ఆట ముగిసే సరికి వికెట్ నష్టానికి 67 రన్స్ చేసింది.
శుభ్మన్ గిల్(104)
ఓపెనర్ జాక్ క్రాలే(29 నాటౌట్), నైట్ వాచ్మన్ రెహాన్ అహ్మద్(9 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. నాలుగో రోజు తొలి సెషన్ భారత్కు కీలకం కానుంది. మూడో రోజు అండర్సన్ వరుస ఓవర్లలో రోహిత్ శర్మ(17), యశస్వీ(13)ని ఔట్ చేసినట్టే.. బుమ్రా ఇంగ్లండ్ టాపార్డర్ పని పడితే మ్యాచ్ భారత్కు వైపు తిరిగినట్టే. నాలుగో ఇన్నింగ్స్లో భారత గడ్డపై ఐదు సార్లు మాత్రమే 300 ప్లస్ స్కోరు నమోదైంది. అయితే.. 250 ప్లస్ టార్గెట్ను ఛేదించిన తొలి పర్యాటక జట్టు రికార్డు ఇప్పటికీ వెస్టిండీస్ పేరిటే ఉంది. ఒకవేళ వైజాగ్ టెస్టులో స్టోక్స్ సేన గెలిస్తే చరిత్ర సృష్టిస్తోంది.