KCR : బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఉమ్మడి వరంగల్ జిల్లా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం వరంగల్ జిల్లాలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. సమైక్య వాదుల పాలనలో జిల్లా అన్ని విధాలుగా వెనుకబడి పోయిందని, అజాం జాహీ మిల్లు ఆగమై పోయిందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే జిల్లా అభివృద్ధిలో దూసుకుపోయిందని చెప్పారు.
‘సమైక్యవాదుల పాలనలో మన వరంగల్ జిల్లా అన్ని విధాలుగా వెనుకబడింది. అజాం జాహీ మిల్లు ఆగమైపోయింది. బీఆర్ఎస్ పాలనలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసుకున్నం. వరంగల్ నడిబొడ్డున 24 అంతస్తులతో ఆకాశమంత ఎత్తున సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించుకున్నం. నగరంలో హెల్త్ యూనివర్సిటీ పెట్టుకున్నం. పరకాల మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఆధ్వర్యంలో మెగా టెక్స్టైల్ పార్క్ తెచ్చుకున్నం. జిల్లాకు ఐదు మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నం. ములుగు, భూపాలపల్లి, నర్సంపేట, మహబూబాబాద్, జనగామల్లో కొత్తగా మెడికల్ కాలేజీలు పెట్టుకున్నం. ఇవన్నీ మీ సాక్షిగనే జరిగినయ్’ అని కేసీఆర్ అన్నారు.
‘ఇప్పుడున్న ముఖ్యమంత్రి చిత్రవిచిత్ర మాటలు మాట్లాడుతున్నడు. వరంగల్కు కాళేశ్వరం నీళ్లే రాలేదు అంటడు. మరె మన నర్సంపేటలో, భూపాలపల్లిలో, మహబూబాబాద్లో, డోర్నకల్లో, పరకాలలో, వర్దన్నపేటలో, పాలకుర్తిలో ఎక్కడి నుంచి వచ్చినయ్ నీళ్లు..? అంతకుముందు కాంగ్రెస్ రాజ్యంలో శ్రీరాంసాగర్ స్టేజ్-2 ద్వారా దశాబ్దాలు గడిచినా బొట్టు నీళ్లు రాలేదు. మీ సహకారంతో తెలంగాణ సాధించుకున్న తర్వాత కష్టపడి అన్ని పూర్తిచేసి మధ్యలో కాళేశ్వరం నిర్మాణం చేస్తే వరంగల్ జిల్లాకు నీళ్లు వచ్చినయ్. బ్రహ్మాండమైన పసిడి రాశుల లాంటి పంటలు పండినయ్’ అని కేసీఆర్ చెప్పారు.