KCR | ఎన్నికల్లో ఓట్లుపడే సమయంలో గోదావరి నదిని ఎత్తుకుపోతా అని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్ పంపిండని.. ఈ చేతగాని రేవంత్రెడ్డి ప్రభుత్వం నోరుమూసుకొని పడి ఉందని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మండిపడ్డారు. రోడ్షోలో భాగంగా హన్మకొండలో జరిగిన కార్నర్ మీటింగ్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలపై మండిపడ్డారు.
‘ఇంతకు ముందు తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా బ్రహ్మాండంగా భూముల ధరలు పెరిగినయ్. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరుగుతుండే. ఇప్పుడు డౌన్ అయ్యిందా ? పెరిగిందా?’ అంటూ ప్రశ్నించారు. బంద్ అయ్యింది అంటూ జనం నినదించారు. ‘అందులో బతికే వేల మంది ఇవాళ రోడ్లపై పడ్డారు. హైదరాబాద్, పెద్దపెద్ద నగరాల్లో గత ఐదునెలలుగా పర్మిషన్లు ఇస్తలేరు. పర్మిషన్లు ఇవ్వకపోవడానికి కారణం ఏందీ? తెలంగాణ రాష్ట్రంలో మనం టీఎస్ బీపాస్ తీసుకువచ్చాం. అప్లికేషన్ పెడితే 21 రోజుల్లో ఆటోమేటిక్గా పర్మిషన్ ఇవ్వాలి. అది చట్టం. ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి, మంత్రివర్గం ఆ చట్టాన్ని ఉల్లంఘించి పర్మిషన్ ఇవ్వడం లేదు. ఎందుకో తెలుసా? వేరే రాష్ట్రాల్లో ఉన్నట్లుగా స్వ్కేర్ ఫీట్ ఇంత అని కాంగ్రెస్ పార్టీకి లంచం ఇవ్వాలట. దాని కోసం మొత్తం ప్రగతిని ఆపేసి.. అభివృద్ధిని ఆపేసి పర్మిషన్లు ఇవ్వడం లేదు. పూర్తయిన బిల్డింగ్లకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదు. ఈ బండారం బయటపెడతాం. రేపే.. ఎల్లుండో ముందుకుపోతాం’ అని స్పష్టం చేశారు.
‘ఈ ఎన్నికల్లో పోటీ చేసే ఇంకొక పార్టీ బీజేపీ పార్టీ. అది చాలా ప్రమాదకరమైన పార్టీ. దానికి ఎంతసేపు పంచాయితీలు పెట్టించుడు.. విద్వేషం తప్పా.. బీజేపీ ఎజెండాలో ప్రజల కష్టసుఖాలు ఉండవు. అందుకోసం యువకులను నేను కోరుతున్నా. వెర్రి ఆవేశం కాదు. పిచ్చి ఆవేశం కాదు. ఈ దేశం మీది. ఈ రాష్ట్రం మీది. రేపటి భవిష్యత్ మీది. ఈ విషయాలను ఊర్లు, బస్తీలు, గ్రామాల్లో చర్చ పెట్టాలి. బీజేపీ ఎజెండాలో ప్రజల కష్ట సుఖాలు ఉంటాయా? మోదీ వంద నినాదాలు చెప్పారు. బేటీ బచావో.. బేటీ పడావో. ఎక్కడన్న ఏమైనా వచ్చిందా? జన్ధన్ యోజనలో ఎవరి బ్యాంకులకైనా రూ.5లు వచ్చినయా? విదేశాలకెళ్లి నల్లధనం తెస్తా.. ఇంటికి రూ.15లక్షలు ఇస్తా అన్నడు. మరి ఇచ్చిండా? రూ.15లు కూడా రాలేదు. అమృత్కాల్ వచ్చిందా? అచ్చేదిన్ వచ్చిందా? అచ్చేదిన్ రాలేదు కానీ, సచ్చేదిన్ వచ్చింది’ అన్నారు.
‘మన కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ వస్తే.. దాన్ని ప్రధాని గుజరాత్కు ఎత్తుకుపోయిండు. కాజీపేటకు వచ్చేదాన్ని గుజరాత్కు తీసుకుపోయాడు. అధేవిదంగా గిరిజన విశ్వవిద్యాలయం పదేళ్ల నుంచి వందసార్లు అడిగితే మొన్న ఎలక్షన్లకు ముందు కాగితం ఇచ్చారు. పదేళ్లు పడతదా ప్రధానమంత్రికి ? ధరల పెరుగుదల, రూపాయి విలువ రూ.83కి పడిపోయింది. ఏ హామీ నెరవేరలేదు. 18లక్షల ఉద్యోగాలు ఖాళీగా కేంద్రంలో ఒక్కదాన్ని నింపరు. ఇవన్నీ పోను మళ్లీ ఇప్పుడు ఏం జరుగుతుంది. మనకు ఉన్న ఒకే ఒక నది.. మన బతుకుదెరువు. నేడైనా.. రేపైనా భవిష్యత్లోనైనా గోదావరి నదే. ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ గొంతుకోసి గోదావరి నది ఎత్తుకుపోతా.. తమిళనాడుకు, కర్ణాటక ఇస్తా అని మాట్లాడుతున్నడు. దయచేసి ఆలోచించాలి’ అన్నారు.
‘గోదావరి నదిని నేను తీసుకొనిపోతా అని బాజాప్తా ఓట్లుపడే సమయంలో నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్ పంపిడు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి. ప్రాణం పోయినా ఇవ్వమని పంచాయితీ పెట్టాలి. నేను ఉన్నప్పుడు అదే పంచాయితీ పెట్టిన. ఆయనమే ఎత్తుకుపోతాంటడు. ఈ సాతగాని రేవంత్రెడ్డి ప్రభుత్వం నోరుమూసుకొని పడి ఉన్నది. ఇందులో మతలబేంది ? నరేంద్ర మోదీ ఎత్తుకుపోతా అని రాష్ట్ర ప్రభుత్వానికి బాజాప్తా పంపిండు. ఈ ముఖ్యమంత్రి ఏమో కుయ్యిలేదు కయ్యిలేదు. ఏమానుకోవాలి దీన్ని. ఇంతకుముందే కృష్ణా నదిని తీసుకుపోయి కేఆర్ఎంబీకి అప్పజెప్పిండు. ఇవాళ గోదావరి ఎత్తుకుపోతాంటే మూతిముడుసుకొని కూర్చున్నరు. ఏం కారణం? దాన్ని ఎవరు కాపాడాలి? అంటూ ప్రశ్నించారు.