Sachin Tendulkar: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు మరో అరుదైన గౌరవం దక్కనుంది. తనకు ఎంతో ఇష్టమైన, తన కెరీర్లో ఎన్నో మధుర జ్ఞాపకాలను ఇచ్చిన ముంబైలోని వాంఖెడే స్టేడియంలో మాస్టర్ బ్లాస్టర్ నిలువెత్తు విగ్రహాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టించింది. ఈ విగ్రహాన్ని బుధవారం (నవంబర్ 01న) ఆవిష్కరించనున్నారు. సచిన్తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, బీసీసీఐ సెక్రటరీ జై షా, ట్రెజరర్ ఆషిష్ షెలార్ లతో పాటు ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఎ) ప్రతినిధులు హాజరుకానున్నారు.
వాంఖేడే స్డేడియంలో సచిన్ టెండూల్కర్ స్టాండ్కు ఆనుకుని ఉండే ఈ విగ్రహాన్ని ఎంసీఎ ఈ ఏడాది లిటిల్ మాస్టర్ 50వ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి పూనుకుంది. సచిన్ 50వ పడిలోకి అడుగుపెట్టిన సందర్భంలో వాంఖెడేతో అతడికున్న అనుబంధానికి తోడు భారత క్రికెట్కు ఈ దిగ్గజం చేసిన సేవలకు గుర్తుగా విగ్రహాన్ని ఏర్పాటుచేస్తున్నట్టు ఎంసీఎ గతంలోనే తెలిపింది.
The Sachin Tendulkar statue will be unveiled tomorrow at the Wankhede Stadium.
Maharashtra CM and Deputy CM will be present at the event!pic.twitter.com/DGq7S9AUhy
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 31, 2023
వాస్తవానికి వన్డే వరల్డ్ కప్లో భాగంగా ముంబైలో జరిగిన తొలి మ్యాచ్ నాటికే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలనుకున్నా పెండింగ్ పనుల కారణంగా అది వాయిదాపడింది. ప్రస్తుతం విగ్రహానికి సంబంధించిన పనులన్నీ పూర్తయిన నేపథ్యంలో బుధవారం విగ్రహావిష్కరణ ఉంటుందని ఎంసీఎ తెలిపింది. కాగా వన్డే వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్ ఆడేందుకు ఇదివరకే ముంబై చేరుకుని వాంఖెడేలో ప్రాక్టీస్ చేస్తున్న భారత క్రికెటర్లు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశముంది.
అహ్మద్నగర్కు చెందిన ప్రమోద్ కాంబ్లీ ఈ విగ్రహాన్ని సచిన్ లెగసీకి నివాళిగా తీర్చిదిద్దినట్టు చెప్పాడు. కాగా సచిన్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ నుంచి తప్పుకున్న సుమారు పదేండ్ల తర్వాత ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తుండటం గమనార్హం. 2013లో సచిన్.. వెస్టిండీస్తో రెండు టెస్టుల సిరీస్లో భాగంగా నవంబర్ 14న ఆఖరి టెస్టు ఆడారు.