ఈ సృష్టిలో ప్రతీ ఒక్కరూ మరణ ద్వారం దగ్గర నిలబడి ఉన్నారన్నది కాదనలేని చేదు నిజం. మనిషికి తానెప్పుడు చనిపోతానో తెలియనప్పుడు ప్రతీ ఘడియనూ మరణ సమయంగానే భావించాలి. మనిషి వేసే ప్రతీ అడుగూ మరణానికి దగ్గర చేసేదే! నేడు జీవితం, రేపు మరణం అన్న భావనతోనే జీవన ప్రయాణాన్ని కొనసాగించాలి. తెలిసిన ప్రపంచం నుంచి తెలియని లోకానికి ప్రయాణమే మరణం. కానీ, మనిషి దీన్ని గుర్తించడు. మరణమనే మాటనే జీర్ణించుకోలేడు. ఇప్పట్లో చావు తన దరికి రాదనుకుంటాడు. ఈ భావనే అతణ్ని మోసానికి గురిచేస్తుంటుంది. కానీ, నిత్యం మరణాన్ని గుర్తుంచుకున్న వారే వివేకవంతులు. ‘చివరకు ప్రతి మనిషీ మరణిస్తాడు. మీరంతా మీ పూర్తి ప్రతిఫలాన్ని ప్రళయంనాడు పొందుతారు’ (దివ్య ఖురాన్ 3:185) అని అల్లాహ్ అప్రమత్తం చేశాడు. ఎవరికైనా మరణ సమయం ఆసన్నమైనప్పుడు వ్యవధి ఉండదని ఖురాన్ హెచ్చరిస్తుంది.
‘మీలో ఎవరికైనా మరణ సమయం సమీపించినప్పుడు.. ఆ వ్యక్తి ‘ఓ నా ప్రభూ! నీవు నాకు మరికొంత వ్యవధి ఎందుకివ్వలేదు. నేను దానధర్మాలు చేసి సజ్జనులలో కలిసిపోయేవాణ్ని కదా?’ అని వాపోయే పరిస్థితి రాకముందే మీకు ఇచ్చిన ఉపాధి నుంచి ఖర్చుపెట్టండి. ఎవరి ఆచరణ వ్యవధి అయినా ముగిసిపోయే సమయం ఆసన్నమైనప్పుడు, అల్లాహ్ ఇక అతనికి ఎంతమాత్రం అదనపు వ్యవధి ఇవ్వడు’ (ఖురాన్ 63:10-11). ‘ఆయన అందరికీ ఒక నిర్ణీత కాలం వరకు గడువు ఇస్తాడు. అంత్యకాలం సమీపించినప్పుడు, ఒక్క ఘడియ కూడా వెనుకా ముందూ కాజాలదు’ (ఖురాన్ 16:61) అని పవిత్ర గ్రంథం హెచ్చరిక. పదిమందికీ సాయం చేసిన మనిషికి స్వర్గంలోకి ప్రవేశం లభిస్తుంది. ఇది ఖురాన్లో అల్లాహ్ ఉద్బోధ.
– ముహమ్మద్ ముజాహిద్ 96406 22076