Rain : ఇవాళ (శనివారం) తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. గాలితో కూడిన వర్షం అల్లకల్లోలం సృష్టించింది. గాలివాన బీభత్సం కారణంగా ఏపీలో ఇద్దరు, తెలంగాణలో ఒకరు మృత్యువాత పడ్డారు. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండలం గోవిందాయిపల్లిలో పిడుగుపాటుకు ఒక గొర్రెల కాపరి మృతిచెందాడు. అచ్చంపేటలో భారీ వర్షం కారణంగా ధాన్యం తడిసిపోయింది.
ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో దాదాపు అరగంటపాటు గాలి, వాన రావడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. రమణయ్యపేట, ముకుందరాజుపేట, దోసలపాడు, చీడిక, జి.జగన్నాథపురం, గొడిచర్ల, డొంకాడ, చినదొడ్డిగల్లు గ్రామాల్లో ఇళ్లు దెబ్బతిన్నాయి. సత్యవరం గ్రామంలో కొబ్బరిచెట్లు నేలకూలి తమలపాకులు సేకరించే ఇద్దరు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ముకుందరాజుపేటలో ఇంటి రేకులు పడి ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి.
గాలుల ప్రభావంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. మామిడి, అరటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కాకినాడ జిల్లా తుని ప్రాంతంలో భారీ ఈదురుగాలులకు తలుపులమ్మ తల్లి ఆలయ మార్గంలో కారుపై చెట్లు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు.