NEET PG | న్యూఢిల్లీ, మే 5: నీట్ పీజీ-2024, జీపీఏటీతో సహా పలు ప్రవేశ పరీక్షల ఫార్మాట్లో నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఫర్ మెడికల్ సైన్సెస్(ఎన్బీఈఎంఎస్) కీలక మార్పులు చేసింది. కంప్యూటర్ ఆధారిత పరీక్షలో సెక్షన్ల వారీగా సమయం కేటాయింపు(టైమ్ బౌండ్ సెక్షన్స్) తప్పనిసరి విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకొన్నది. అంటే కొత్త విధానం ప్రకారం ప్రశ్నాపత్రాన్ని సెక్షన్ల వారీగా విభజించి.. ప్రతి సెక్షన్కు కొంత సమయం కేటాయించనున్నారు. ఆ సెక్షన్ను ఇచ్చిన సమయంలో పూర్తి చేసిన తర్వాతనే తర్వాతి సెక్షన్ ఓపెన్ అవుతుంది. బహుళైచ్ఛిక ప్రశ్నలతో నిర్వహించే నీట్ పీజీతో సహా నీట్ ఎండీఎస్, నీట్ ఎస్ఎస్, ఎఫ్ఎంజీఈ, డీఎన్బీ పీడీసీఈటీ, జీపీఏటీ, డీపీఈఈ, ఎఫ్డీఎస్టీ, ఎఫ్ఈటీ పరీక్షల్లో ఈ కొత్త మార్పును తీసుకురానున్నట్టు ఎన్బీఈఎంఎస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఎగ్జామినేషన్ ప్రక్రియ సమయంలో ఎదురవుతున్న పలు ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో పరీక్షల భద్రత, ప్రాముఖ్యతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపింది.
కొత్త విధానానికి సంబంధించి ఎన్బీఈఎంఎస్ వివరణ ఇచ్చింది. ఉదాహరణకు నీట్ పీజీ-2024 పరీక్షను తీసుకొంటే, ప్రశ్నాపత్రంలో ఏ, బీ, సీ, డీ, ఈ అనే టైమ్ బౌండ్ సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్లో 40 ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు 42 నిమిషాల సమయం కేటాయించబడి ఉంటుంది. ఇచ్చిన సమయంలో ఆసెక్షన్పూర్తి చేసిన తర్వాతనే అభ్యర్థి తర్వా త సెక్షన్కు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఇలా ప్రతి సెక్షన్కు సమయం కేటాయింపు అనేది అమలవుతుంది. కేటాయించిన సమయం అయిపోయిన తర్వాత ఒక సెక్షన్లోని ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలను మార్చేందుకు వీలు ఉండదు. ఇచ్చిన సమయంలో సంబంధిత సెక్షన్లో ఒక ప్రశ్నను రివ్యూ చేసుకొనేందుకు మార్కింగ్ ఆప్షన్ కూడా ఉంటుందని ఎన్బీఈఎంఎస్ పేర్కొన్నది.
కంపార్ట్మెంట్ ఎగ్జామ్స్ రద్దు
ఐసీఎస్ఈ 10, ఐసీఎస్ఈ 12 తరగతుల బోర్డ్ పరీక్ష ఫలితాల్ని ‘ద కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్’ (సీఐఎస్సీఈ) సోమవారం ప్రకటించబోతున్నది. ‘10, 12 తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాల్ని సోమవారం ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నాం’ అని చీఫ్ ఎగ్జిక్యూటివ్, సెక్రెటరీ జోసెఫ్ ఇమ్మానుయెల్ మీడియాకు తెలిపారు. బోర్డ్ వెబ్సైట్, కెరీర్స్ పోర్టల్, డిజీ పరీక్ష ఫలితాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అయితే ఈ సెషన్కు సంబంధించి 10, 12 తరగతుల కంపార్ట్మెంట్ పరీక్షలను బోర్డ్ నిలిపివేసింది. ‘జూలైలో నిర్వహించే ‘ఇంప్రూమెంట్ ఎగ్జామ్స్’తో గరిష్టంగా రెండు సబ్జెక్ట్స్లో విద్యార్థులు తమ మార్కులు లేదా గ్రేడ్స్ను మెరుగుపరుచుకోవచ్చు’ అని ఇమానుయెల్ చెప్పారు.
ఆదివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ-2024 పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిందని సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొట్టాయి. ఈ ప్రచారాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఖండించింది. పూర్తిగా అవాస్తమని పేర్కొన్నది. రాజస్థాన్లోని ఓ పరీక్షా కేంద్రంలో హిందీ మీడియం విద్యార్థులకు ఇన్విజిలేటర్ పొరపాటున ఇంగ్లిష్ మీడియం ప్రశ్నాపత్రం ఇచ్చాడని, ఇన్విజిలేటర్ ఆ తప్పును సరిదిద్దే లోపే కొంత మంది విద్యార్థులు ప్రశ్నాపత్రంతో సహా బలవంతంగా ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వెళ్లిపోయారని ఎన్టీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిందని, అప్పటికే దేశవ్యాప్తంగా అన్ని సెంటర్లలో పరీక్ష మొదలైందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పరీక్షా పత్రం లీక్ అనే ప్రస్తావనే ఉండదని ఆయన అన్నారు.