విశ్వనాథ గారు తను రాసిన ఈ రామాయణ కల్పవృక్షం గురించి చెప్తూ.. ‘ఈ రామాయణ కల్పవృక్షం, తెలుగు
రామాయణం. ఒక తెలుగు కుటుంబంలో జరిగిన కథలాగా రాశాను. నేను రాసింది, మున్ముందు జనాలకు
అర్థమవుతుందో కాదో, నేను బతికి ఉండగానే నా చేత చెప్పించుకోండి’ అంటూ గాద్గదిక స్వరంతో చెప్పారు.
కవి సామ్రాట్, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారు మాట్లాడే వెన్నెముక-పాటపాడే సుషుమ్న. తాను సత్యం అని నమ్మినదాన్ని నిర్భయంగా, నిస్సంకోచంగా, సభావేదికల మీద, తన రచనల్లోనూ చాటిన ధైర్యశాలి విశ్వనాథ. అందుకే ఆయనను ‘మాట్లాడే వెన్నెముక’ అన్నారు. ‘పాట పాడే సుషుమ్న’ అంటే మనందరికీ తెలిసిన విషయమే! ఇడా, పింగళా నాడుల మధ్యగా ఉంటుంది ఈ సుషుమ్నా నాడి. దాని ద్వారానే మూలాధార చక్రం నుంచి కుండలినీ శక్తి, సహస్రార చక్రం చేరి బ్రహ్మానందానుభూతిని కలిగిస్తుంది. అందుకే విశ్వనాథ పాట పాడే సుషుమ్న అన్నారు. అంటే సాహితీ మధురిమలు గ్రోలే వారికి, విశ్వనాథ వారి కవిత్వం, అమృత పానం చేసినంత బ్రహ్మానందం కలిగిస్తుంది.
ప్రపంచ ప్రఖ్యాత నాటకకర్త షేక్స్పియర్ గొప్ప నాటకాలూ, కవితలూ రాశాడు. మహా కావ్య రచన చేయలేదు. మిల్టన్ మహాకావ్యం రచించినా నవల రాయలేదు. రవీంద్రనాథ్ ఠాగూర్ అనేక సాహిత్య ప్రక్రియల్లో రచనలు చేశారు. ఒక్క మహాకావ్యం తప్ప. కానీ, విశ్వనాథ వారి సాహిత్యంలో, నవల, కథ, కవిత్వం, నాటకం, మహాకావ్యం, విమర్శ లాంటి సమగ్ర సాహిత్య ప్రక్రియలు అన్నీ ఉన్న బహు గొప్ప సాహిత్యం.
అన్ని ప్రక్రియలు అయిన తర్వాత రామాయణ కల్పవృక్షం రాశారు. కొంతమంది ‘ఇప్పటిదాకా చాలామంది రామాయణం రాశారు కదా, మళ్లీ మీరెందుకు రాయడం’ అని అడిగారుట. దానికి వారు…
‘మరల నిదేల రామాయణంబన్నచో ఈ జగత్తు తినుచున్న అన్నమే తినుచున్నది.చేయుచున్న సంసారమే చేయుచున్నది.
తనదైన బ్రతుకు రుచి తనదిగాన’ అని తాను రామాయణాన్ని తనదైన అనుభూతి కోసం రాశానని చెప్పుకున్నారు బహుముఖీన సాహితీ సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు.
‘నన్నయ, తిక్కన, శ్రీనాథుడు, రాయలు, పెద్దన, తెనాలి రామకృష్ణుడూ మొదలైన ఆరుగురు కవులు 19వ శతాబ్దిలో విశ్వనాథగా అవతరించారు’ అని మరో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ఆచార్య సి.నారాయణరెడ్డి అన్నారు. తాత్త్విక, ధార్మిక, ఆధ్యాత్మికాది విషయాలు తన రచనల్లో ప్రతిబింబించడమే కాదు, రేడియో నాటికలు, గేయ కావ్యాలు, ఎబ్జలు, విమర్శ, నవలలు, నవలికలు, మహాకావ్యాలు రాసిన సంపూర్ణ సాహితీమూర్తి విశ్వనాథ సత్యనారాయణ గారు.
ఆయన 50 ఏండ్ల కిందట రాసిన ‘విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు’ నవల నాడూ, నేడూ, రేపటి తరాలకు కనువిప్పు కలిగించడమే కాకుండా చాలా హాస్యంగా ఉంటుంది. ఇంగ్లీషు భాషలోని లోపాలను ఎత్తిచూపుతూ, తెలుగు భాష ఎంత పరిపూర్ణమైన భాషో ఈ నవలలో చాలా చక్కగా హాస్యం పండిస్తూ రాశారు.
అయితే మారుతున్న విలువల సమాజంలో విశ్వనాథ ఛాందసుడు. ఆయన కవిత్వం తిరోగమన కవిత్వమే కానీ, అభ్యుదయం కాదనే వాదనలు చాలా ఉన్నాయి. ఆయనలోని జాతీయతా దృక్పథాన్ని అపా ర్థం చేసుకొని ఆధునికతకు, విజ్ఞానానికీ వ్యతిరేకి అన్నా రు. భారతదేశంలో ఏమీ లేదు, చెత్తే అంటున్న రోజుల్లో భారతదేశంలో ఏముందో తన సాహిత్యం ద్వారా నిరూపించి చూపించారు విశ్వనాథ. మా నాన్నగారు మహాకాళి వేంకటరావు విశ్వనాథ వారి శిష్యులు. ఆయన కవిత్వం అంటే నాన్నకు చాలా ప్రాణం. ఆయన గురించి మా నాన్న రాసిన పద్యాల్లో ఒకటి కింద ఉదహరిస్తాను.
చ. కవియననీవెగా, కవుల కాంతి కిరీటి స్వరాట్టువీవె,మా నవతర కావ్యదీధిపతికి నాట్యతపంచిన కావ్యభాస్కరాకవనము ఆత్మద్రష్టము, ప్రకాశము పెంచు నటించు,భారతీ రవమును నీదు కావ్యములరంజింపజేసితి విశ్వనాథరో!’ అని తన గురువు విశ్వనాథ పాండిత్యాన్ని కీర్తిస్తూ రాశారు. విశ్వనాథ గారికి కూడా తన శిష్యుడైన వేంకటరావు అంటే చాలా అభిమానం. మా తాతగారు మహాకాళి వేంకటేశ్వరరావు, విశ్వనాథ వారు చెళ్లపిళ్ల వారి శిష్యులు. తాత గారు కూడా మంచి పండితులు.
విశ్వనాథ రామాయణ కల్పవృక్షంలోని పద్యాలను కొన్నింటిని మాకు అర్థం చెప్పి కంఠస్థం చేయించారు. ఒకరోజు విశ్వనాథ సత్యనారాయణ గారు మా ఇంటికి వచ్చారు. మా తాతగారు కీ.శే.మహాకాళి వేంకటేశ్వరరావును కౌగిలించుకొని చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకొన్నారు. వారికి ఏర్పరిచిన ఉచితాసనం మీద కూర్చున్నాక, నాన్నగారు మా అక్కాచెల్లెళ్లు నలుగురిని, మా తమ్ముళ్లను, అమ్మనీ, నానమ్మనీ పరిచయం చేశారు. మేము వారి ముందు చేతులు కట్టుకొని రామాయణ కల్పవృక్షంలోని ఆంజనేయుడి స్తుతి మంగళ రూప అయ్య, హరి మర్కట పద్యం, ఆంజనేయుడు సీతను చూచి వచ్చినప్పుడు రాముడితో, కాంచితి సీత పద్యంతో పాటు ఇంకా కొన్ని పద్యాలు వినిపించాం. వారు చాలా సంతోషపడ్డారు.
అప్పుడు విశ్వనాథ గారు తను రాసిన ఈ రామాయణ కల్పవృక్షం గురించి చెప్తూ.. ‘ఈ రామాయణ కల్పవృక్షం, తెలుగు రామాయణం. ఒక తెలుగు కుటుంబంలో జరిగిన కథలాగా రాశాను. నేను రాసింది, మున్ముందు జనాలకు అర్థమవుతుందో కాదో, నేను బతికి ఉండగానే నా చేత చెప్పించుకోండి’ అంటూ గాద్గదిక స్వరంతో చెప్పారు. మా కండ్లకు నీళ్లు వచ్చాయి. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు మా ఇంటికి రావడం, వారి ముందు మేము పద్యాలు చదవడం, వారి ఆశీర్వచనం తీసుకోవడం నా జీవితంలో మరిచిపోలేని మధురానుభూతి.
విశ్వనాథ వారికి జ్ఞానపీఠ అవార్డు వచ్చినప్పుడు విలేకరులు ‘అవార్డు రావడం పట్ల మీ స్పందన ఏమి టి?’ అనడిగితే ‘అవార్డు ఇవ్వడం కంటే మిరపకాయ ధరలు తగ్గిస్తే ఎక్కువ సంతోషపడేవాడిని’ అన్నారట. అప్పట్లో మిరప ధరలు విపరీతంగా పెరిగిపోయాయ ట. అంత నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా మాట్లాడేవా రు. అంటే అవార్డు వచ్చినా రాకపోయినా, నిరామయునిగా ఉండే తత్వం.
నాకు గుర్తున్నంతవరకూ, వారికి జ్ఞానపీఠ పురస్కారానికి లక్ష రూపాయల నగదు బహూకరించారు. దరిద్రంలో ఉన్నప్పుడు డబ్బు రాలేదు, డబ్బు అవసరం అంతగా లేనప్పుడు డబ్బు వచ్చిందని అన్నారుట. ఆ లక్ష రూపాయల్లో సగం తన ఊరిలోని రామాలయ పునరుద్ధరణకు, ధానధర్మాలకు కొంత, రుణ విముక్తి కోసం కొంత వెచ్చించారనీ, ఒక్క పైసా కూడా సొంతానికి వాడుకోలేదట.
విశ్వనాథ విరచిత వేయి పడగలులో ధర్మారావు పాత్ర నేటికీ నిత్య నూతనం. ఈ నవలను ‘సహస్రఫణ్’ పేర మాజీ భారత ప్రధాని, పీవీ నరసింహారావు గారు హిందీలోకి అనువదించారు. ఆయన అనువదిస్తూ ‘శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారికి ప్రాచీన సంస్కృతి మీద గల శ్రద్ధ అంతా ఇంతా కాదు. వారు సంప్రదాయబద్ధులైన పిడివాదులు కారు. స్వధర్మ రక్షణకు అవి ఉద్దేశింపబడ్డాయి. సహస్రఫణ్లో అనేక చోట్ల ఈ విషయం గోచరిస్తుంది. విశ్వనాథ సాహిత్యమంతా చైతన్యానికి తిరుగులేని విజయ పతాకాలు’ అంటూ ప్రస్తుతించారు. ఈ నవలలో విశ్వనాథ సత్యనారాయణ గారు హిందువుల వివాహం, కుటుంబ వ్యవస్థ, ప్రకృతి ఆరాధన, మొదలైన వాటిమీద జరుగుతున్న పరిణామాల్లో వస్తున్న విలువల సంక్షోభం గురించి, గ్రామీణ జీవితంలోని మానవ సంబంధాలను, వివిధ వాదాల మీద తన ప్రతిస్పందననూ మహనీయంగా చిత్రించారు.
విశ్వనాథ వారి సంప్రదాయం ఎంత ప్రాచీనంగా కనపడుతుందో, అంత ఆధునికంగానూ కనపడుతుంది. ఇంగ్లీషు సాహిత్యంలో ఆధునిక వైతాళికుడైన టి.యస్.ఎలియట్, భారతీయ ఉపనిషత్తులను ప్రపంచశాంతి సూక్తంగా అంగీకరించాడు. అందుకే విశ్వనాథ వారిని తెలుగు ఎలియట్ అనీ, ఎలియట్ను ఇంగ్లీషు విశ్వనాథ అని అంటారు.
కేతవరపు రాజ్యశ్రీ
85001 21990