స్వాత్మవత్ సర్వభూతేషు కాయేన మనసా గిరా,
అనుజ్ఞా యా దయా సైవ ప్రోక్తా వేదాన్తవేదిభిః॥
(దర్శనోపనిషత్తు 1-15)
శరీరంతో, మాటతో, మనసుతో సకల జీవుల్లోనూ తనపై గల ప్రేమను చూపించడాన్ని ‘దయ’ అని వేదాంతులు చెబుతారు. ‘నితాంతాపార భూతదయయును.. తాపస మందార! నాకు దయసేయ గదే!..’ అని ప్రార్థించాలని భాగవతం సూచిస్తున్నది. అంటే ఇతరులపై అంతులేని భూతదయ మనిషికి ఉండటం ముఖ్యమని తెలుస్తున్నది. ఆధ్యాత్మిక సాధకులకైతే ఇక చెప్పాల్సిన పని లేదు. మనం భగవంతుడిని కోరుకునేదల్లా మన మీద దయ చూపించమనే కదా! మనకు తోటి ప్రాణులపై దయ ఉంటే.. తోటి ప్రాణులకే గాక భగవంతునికీ మన మీద దయ కలుగుతుంది. ఎవరికి మెత్తటి హృదయం ఉంటుందో వారికే దయ ఉంటుంది. ఎదుటివారి కష్టాలు వారు మాత్రమే చూడలేకపోతారు. చూడలేక ఒక్కొక్కసారి విలపిస్తారు కూడా. శక్తివంచన లేకుండా సాయం చేస్తారు.
ఒకానొకప్పుడు కాశీ ప్రాంతం ‘ఘాజీపురం‘ గ్రామ సమీపంలోని గంగా తీరంలో పవహారిబాబా అనే యోగి సొరంగం నిర్మించుకొని అందులో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. పవహారి అంటే గాలిని భుజించేవాడు అని అర్థం. ఆ సొరంగం పైన ఒక ఆశ్రమం కూడా నిర్మించి భక్తులకు దర్శనమిచ్చేవాడు. ఒకసారి ఒక దొంగ ఆశ్రమంలో జొరబడి వస్తువులన్నీ మూట గట్టుకున్నాడు. ఇంతలో ఏదో అలికిడి కాగా.. మూటను పడవేసి దొంగ పారిపోయాడు. బాబా ఇది గమనించి దొంగ దరిద్రావస్థకు మిక్కిలి చింతించినాడు. ‘అయ్యో పాపం’ అని ఎంతో జాలితో మూట చేత బుచ్చుకొని దొంగవెంట పరుగెత్తి కలుసుకున్నాడు. మూటను దొంగ పాదాల వద్ద ఉంచి కన్నీళ్లు పెట్టుకున్నాడు.
‘మన్నించు నాయనా! ఈ వస్తువులు నీవే! నావి కావు. తీసుకుపో’ అని బతిమాలాడట. ఆ మాటలకు దొంగ విస్తుపోయాడు. తన కర్కశత్వాన్ని వదిలిపెట్టి యోగి శిష్యుడిగా మారిపోయాడు. దర్శనోపనిషత్తు వాక్యానికి పవహారి బాబా నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తాడు!
– డా॥ వెలుదండ సత్యనారాయణ