టీ20 ప్రపంచకప్-2022 దగ్గరపడుతున్న కొద్దీ టీమిండియా ఆటగాళ్లు తీరిక లేని క్రికెట్ ఆడనున్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా.. ఆ వెంటనే వెస్టిండీస్ కు వెళ్లనుంది. అదీ ముగిశాక నేరుగా స్వదేశానికి వచ్చి ఆసియా కప్ లో పాల్గొంటారని భావించినా ఇప్పుడు మరో కొత్త సిరీస్ కూడా చేరింది. విండీస్ పర్యటన ముగిసిన తర్వాత భారత జట్టు జింబాబ్వే టూర్ కు వెళ్లనుంది.
ఆగస్టు 18 నుంచి 22 వరకు భారత జట్టు జింబాబ్వేతో మూడు వన్డేలు ఆడనుందని క్రిక్ బజ్ నివేదిక పేర్కొంది. ఐసీసీ వన్డే సూపర్ లీగ్ లో భాగంగా ప్రపంచకప్ కు అర్హత మ్యాచులుగా వీటిని నిర్వహించనున్నారు. జింబాబ్వే క్రికెట్ ఈ విషయాన్ని ధృవీకరించింది.
భారత జట్టు ఈనెల 17న ఇంగ్లండ్ పర్యటన ముగించుకుని వెస్టిండీస్ బయల్దేరుతుంది. అక్కడ 22 నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్ లో పాల్గొంటుంది. వన్డే సిరీస్ ముగిశాక జులై 29 నుంచి ఆగస్టు 7 వరకు కరేబియన్ జట్టుతో ఐదు టీ20లు ఆడుతుంది. ఈ పర్యటన ముగిశాక ఆగస్టు 15న జింబాబ్వేకు బయల్దేరనుంది.
జింబాబ్వేతో 18, 20, 22 తేదీలలో మూడు వన్డేలు ఆడే భారత జట్టు నేరుగా స్వదేశానికి వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఆసియా కప్ జరగాల్సి ఉంది. ఆగస్టు 28న భారత్-పాక్ మ్యాచ్ కూడా ఖరారైందని వార్తలు వస్తున్న నేపథ్యంలో రోహిత్ సేన స్వదేశానికి తిరిగొచ్చేది ఆసియా కప్ తర్వాతే..!