లాహోర్: ఆసియాకప్ సూపర్-4 దశకు చేరేందుకు శతవిధాల ప్రయత్నించిన అఫ్గానిస్థాన్ చివరి మెట్టుమీద బోల్తా పడింది. గ్రూప్-బిలో భాగంగా మంగళవారం జరిగిన ఉత్కంఠ పోరులో అఫ్గాన్ 2 పరుగుల తేడాతో శ్రీలంక చేతిలో ఓడింది. మొదట లంక 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేయగా.. 37.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదిస్తే సూపర్-4కు అర్హత సాధించే క్రమంలో అఫ్గాన్ అద్భుత పోరాటంతో ఆకట్టుకుంది. మిడిలార్డర్ మొత్తం టీ20 తరహా బ్యాటింగ్తో లంకేయులను ఒత్తిడిలోకి నెట్టారు.
ఆల్రౌండర్ మహమ్మద్ నబీ (32 బంతుల్లో 65; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), కెప్టెన్ హష్మతుల్లా (59), రహమత్ షా (45) దుమ్మురేపారు. చివర్లో నజీబుల్లా (23; ఒక ఫోర్, 2 సిక్సర్లు), రషీద్ ఖాన్ (16 బంతుల్లో 27 నాటౌట్; 4 ఫోర్లు, ఒక సిక్సర్) ఎంత పోరాడినా ఫలితం లేకపోయింది. లంక బౌలర్లలో కసున్ రజిత 4 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు కుషాల్ మెండిస్ (92; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో లంక మంచి స్కోరు చేయగలిగింది.