Afghanistan : అఫ్గానిస్థాన్ జట్టు సంచలనం సృష్టించింది. పాకిస్థాన్(Pakistan)పై తొలి టీ20 విజయం నమోదు చేసింది. షార్జాలో జరిగిన మొదటి టీ20లో రషీద్ ఖాన్ (Rashid Khan) కెప్టెన్సీలోని అఫ్గాన్ టీమ్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. మాజీ కెప్టెన్ మహమ్మద్ నబీ సిక్సర్తో మ్యాచ్ ముగించాడు. ‘ఈ విజయం చాలా సంతోషాన్ని ఇచ్చింది. తర్వాతి మ్యాచుల్లోనే ఇదే ప్రదర్శన చేస్తామని ఆశిస్తున్నా. మేము మరింత మెరుగవ్వాల్సి ఉంది. 2024 పొట్టి ప్రపంచకప్కి క్వాలిఫై కావడమే మా లక్ష్యం’ అని కెప్టెన్ రషీద్ ఖాన్ తెలిపాడు.
మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 92 రన్స్ మాత్రమే చేసింది. ఆ జట్టులో ఇమాద్ వసీం (18 రన్స్) టాప్ స్కోరర్. ఫజల్ హక్ ఫారుకీ, ముబిబుల్ రెహ్మాన్, మహమ్మద్ నబీ రెండేసి వికెట్లు తీసి పాక్ను దెబ్బకొట్టారు. స్వల్ప లక్ష్య ఛేదనలో అఫ్గానిస్థాన్ 45 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. నబీ (38), నజీబుల్లా జద్రాన్ (17) అజేయంగా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చారు. రెండో టీ20 మార్చి 26న జరగనుంది.
అఫ్గానిస్థాన్తో టీ20 సిరీస్కు రెగ్యులర్ కెప్టెన్ బాబార్ ఆజాంతో పాటు సీనియర్లు రిజ్వాన్, షాహీన్ ఆఫ్రీది, హ్యారిస్ రౌఫ్లకు పాక్ క్రికెట్ బోర్డు విశ్రాంతినిచ్చింది. బాబర్ స్థానంలో ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ సారథ్య బాధ్యతలు అప్పగించింది. యువకులతో కూడిన పాక్ అఫ్గాన్తో మూడు టీ20 మ్యాచ్లు ఆడనుంది. మొదటి టీ20లో పాక్ టాపార్డర్ విఫలం అయింది. అనుభవం ఉన్న సీనియర్లు లేకపోవడంతో ఆ జట్టు రాణించలేకపోయింది.
గత ఏడాది ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇచ్చిన పొట్టి ప్రపంచకప్లో అఫ్గానిస్థాన్ దారుణంగా విఫలమైంది. ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ప్రపంచకప్ ఓటమికి బాధ్యత వహిస్తూ మహమ్మద్ నబీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దాంతో, అనుభవజ్ఞుడైన రషీద్ ఖాన్కు అఫ్గన్ క్రికెట్ బోర్డు టీ20 పగ్గాలు అప్పగించింది.