Teamindia Kit Sponser : భారత జట్టు కొత్త కిట్ స్పాన్సర్గా ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ అడిడాస్ అవకాశం దక్కించుకోనుంది. బీసీసీఐ, అడిడాస్ మధ్య తుది దశ చర్చలు జరుగుతున్నాయి. కిట్ స్పాన్సర్గా అడిడాస్తో ఐదేళ్లకు బీసీసీఐ ఒప్పందం చేసుకోనుంది. దాంతో భారత క్రికెట్ బోర్డుకు రూ.350 కోట్ల ఆదాయం సమకూరనుంది. ‘కాంట్రాక్టుకు సంబంధించి అన్ని పనులు దాదాపు పూర్తయ్యాయి. ఎంత మొత్తానికి అనేది తేలాల్సి ఉంది’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
ఈ ఒప్పందం గనుక కుదిరితే.. ఇకనుంచి కిల్లర్ జీన్స్కు చెందిన కేవల్ కిరణ్ క్లోతింగ్ లిమిటెడ్ స్థానంలో అడిడాస్ కంపెనీ భారత జట్టు కిట్ స్పాన్సర్గా ఉండనుంది. ఈ ఏడాది జూన్ నుంచి 2028 వరకు కిట్ స్పాన్సర్గా కొనసాగుతుంది. టీమిండియా ఆడిన ప్రతి మ్యాచ్కు అడిడాస్ రూ.65 లక్షలు బీసీసీఐకి చెల్లించనుంది.
2006లోనే టీమిండియా కిట్ స్పాన్సర్గా అడిడాస్ పోటీపడింది. కానీ, మూడో స్థానంతో సరిపెట్టుకుంది. నైక్ కంపెనీ హక్కులు దక్కించుకుంది. భారత జట్టు ఆడిన ప్రతి మ్యాచ్కు నైక్ సంస్థ రూ. 85 లక్షలు చెల్లించింది. రాయల్టీగా ఏడాదికి రూ. 30 కోట్లు బీసీసీఐకి ముట్టజెప్పింది. అయితే.. 2020లో కరోనా సమయంలో నైక్ తన నిర్ణయం మార్చుకుంది. బీసీసీఐకి అంత డబ్బు ఇవ్వడం ఎందుకని ఆలోచించి, కిట్ స్పాన్సర్గా తప్పుకునేందుకు సిద్ధమైంది. దాంతో, ఎంపీఎల్ సంస్థ స్పాన్సర్షిప్ హక్కులు సొంతం చేసుకుంది.
భారత జట్టు కిట్ స్పాన్సర్గా ఎంపీఎల్ ఆసక్తి చూపకపోవడంతో కిల్లర్ కంపెనీ ముందుకొచ్చింది. ఐదు నెలలకు గానూ బీసీసీఐ ఈ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకుంది. ఈ ఏడాది మే నెలతో స్పాన్సర్ ఒప్పందం పూర్తి కానుంది. అయితే.. కిల్లర్ కంపెనీ స్పాన్సర్షిప్ కొనసాగించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తోంది. కానీ, బీసీసీఐ మాత్రం పెద్ద కంపెనీతో కాంట్రాక్ట్ కుదుర్చుకోవాలని బీసీసీఐ భావించింది. అనుకున్నట్టుగానే జర్మనీకి చెందిన అడిడాస్కు స్పాన్సర్ హక్కులు కట్టబెట్టేందుకు సిద్ధమైంది.