ICC : ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో టీమిండియా ప్లేయర్లు సత్తా చాటారు. ఏకంగా ముగ్గురు ఆల్రౌండర్లు టాప్ 5లో చోటు దక్కించుకున్నారు. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 406 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్లో అదరగొడుతున్న స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ (376 పాయింట్లు ) రెండో స్థానంలో నిలిచాడు.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ రెండు టెస్టుల్లో కీలక ఇన్నింగ్స్లు ఆడిన అక్షర్ పటేల్ (283 పాయింట్లు) ఐదో స్థానానికి ఎగబాకాడు. ఆల్రౌండర్ ర్యాంకింగ్స్లో ముగ్గురు భారత క్రికెటర్లు చోటు దక్కించుకోవడం ఇదే మొదటిసారి.
1. రవీంద్ర జడేజా – భారత్ – 460 పాయింట్లు
2. రవిచంద్రన్ అశ్విన్ – భారత్ – 376 పాయింట్లు
3. షకిబుల్ హసన్ – బంగ్లాదేశ్ – 329 పాయింట్లు
4. బెన్ స్టోక్స్ – ఇంగ్లండ్ – 320 పాయింట్లు
5. అక్షర్ పటేల్ – భారత్ – 283 పాయింట్లు
ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్లో కూడా అశ్విన్ (864 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచాడు. వరల్డ్ నంబర్ 1 బౌలర్ జేమ్స్ అండర్సన్ (866 పాయింట్లు)కు, అశ్విన్కు రెండు పాయింట్లు తేడా ఉంది అంతే. ఇండోర్ టెస్టులో అశ్విన్ చెలరేగితే అండర్సన్ను వెనక్కి నెట్టి నంబర్ 1 ర్యాంకు అందుకోవడం ఖాయం.
దాదాపు ఐదు నెలల విరామం తర్వాత జట్టులోకి వచ్చిన జడేజా బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ తొలి రెండు టెస్టుల్లో అదరగొట్టాడు. అశ్విన్తో కలిసి ఆస్ట్రేలియా బ్యాటర్లను వణింకించాడు. స్పిన్కు అనుకూలించిన నాగ్పూర్, ఢిల్లీ పిచ్లపై వీళ్లు చెలరేగారు. అశ్విన్, జడ్డూ కలిసి రెండు మ్యాచుల్లో 31 వికెట్లు పడగొట్టారు. మొదటి టెస్టులో వీళ్లు 15 వికెట్లు తీయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ 132 రన్స్తో ఓడిపోయింది. ఢిల్లీ టెస్టులో జడ్డూ పది వికెట్ల ప్రదర్శన చేశాడు. అతను ఈ ఫార్మాట్లో 10 వికెట్లు తీయడం ఇది రెండోసారి. అంతేకాదు ఒకే ఇన్నింగ్స్లో ఐదుగురిని బౌల్డ్ చేసి 21 ఏళ్ల క్రితం అనిల్ కుంబ్లే నెలకొల్పిన రికార్డును సమం చేశాడు.
తొలి రెండు టెస్టుల్లో నెగ్గిన భారత్ నాలుగు టెస్టుల సిరీస్లో 2-0 ఆధిక్యంలో ఉంది. మూడో టెస్టు ఇండోర్లో మార్చి 1న జరగనుంది. ప్రపంచటెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించాలంటే ఇండియా ఈ మ్యాచ్లో కూడా తప్పనిసరిగా గెలవాలి. మూడో టెస్టులోనూ విజయం సాధిస్తే భారత జట్టు దర్జాగా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుతుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా ఫైనల్ బెర్తు ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. జూన్లో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్కు ఇంగ్లండ్లోని ఓవల్ స్టేడియం వేదిక కానుంది.